సుశాంత్ మీద రెండు సినిమాలు

వాస్తవ ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో బాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంటుంది. ముఖ్యంగా మీడియాలో బాగా చర్చనీయాంశం అయిన క్రైమ్ స్టోరీల ఆధారంగా తరచుగా అక్కడ సినిమాలు వస్తుంటాయి. ఈ క్రమంలోనే గత ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి మీదా సినిమాలు తీసేస్తున్నారు అక్కడి ఫిలిం మేకర్స్. సుశాంత్ మృతి నేపథ్యంలో హిందీలో ఒకటికి రెండు సినిమాలు తయారవుతుండటం గమనార్హం.

ఐతే ఈ రెండు సినిమాల పట్ల సుశాంత్ కుటుంబం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రాల విడుదలను ఆపాలంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కోర్టును సైతం ఆశ్రయించారు. కానీ అక్కడ ఆయనకు ప్రతికూల ఫలితమే ఎదురైంది. ఆయన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.

సుశాంత్ జీవిత కథ ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సుసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్’ పేరుతో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి హింీలో. ‘న్యాయ్’ మూవీ విడుదలకు సైతం సిద్ధమైంది. ఇందులో సుశాంత్ పాత్రను జుబర్.కె.ఖాన్ పోషించాడు. దిలీప్ గులాటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఐతే ఈ చిత్రంలో సుశాంత్ పేరును, అతడి జీవితంలోని ఘటనలను ఉదహరించకుండా చూడాలని.. సినిమా విడుదలను ఆపాలని.. ఈ చిత్రం తెరకెక్కించడం ద్వారా తమ కుటుంబానికి మానసిక వేదనను కలిగించినందుకు గాను రూ.2 కోట్ల నష్ట పరిహారం కూడా చెల్లించాలని కేకే సింగ్ తన పిటిషన్లో కోరారు.

కానీ కోర్టు అందుకు నిరాకరించింది. ‘న్యాయ్’ విడుదలను తాము అడ్డుకోజాలమని పేర్కొంది. సుశాంత్ మీద తెరకెక్కుతున్న మిగతా సినిమాల విషయంలోనూ కేకే సింగ్ అభ్యంతరాలు వ్యక్తం చేయగా.. కోర్టు వాటిలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.