షర్మిలది మరీ అత్యాసేనా ?

‘టీఆర్ఎస్ బహిష్కృత మంత్రి ఈటల రాజేందర్ వస్తానంటే పార్టీలోకి ఆహ్వానిస్తాం’ ..ఇది తాజాగా ఈటల గురించి వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్య. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూతురి అర్హతతో తెలంగాణా రాజకీయ పార్టీ పెట్టాలని షర్మిల ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. గడచిన ఐదుమాసాలుగా తెలంగాణా రాజకీయాల్లోకి ఇపుడే ఆమె అడుగుపెట్టారు. ఇంకా పార్టీ పెట్టలేదు, అజెండా ఏమిటో తెలేదు, కనీసం జెండా ఏమిటో కూడా ఎవరికీ తెలీదు.

ఇలాంటిది తొందరలో పెట్టబోయే పార్టీలోకి ఈటల రాజేందర్ చేరుతారని షర్మిల ఎలా అకున్నారో ఎవరికీ అర్ధం కావటంలేదు. కేసులకు భయపడే ఈటల బీజేపీలో చేరుతున్నారా ? లేకపోతే భవిష్యత్ బాగుంటుందని అంచనా వేసుకునే కమలం కండువా కప్పుకుంటున్నారో కాలమే చెప్పాలి. అలాంటిది రాజేందర్ చేరుతానంటే తమ పార్టీలోకి ఆహ్వానిస్తామని షర్మిల చెప్పటమే కాస్త ఓవర్ గా అనిపిస్తోంది.

ఎప్పుడు ఏర్పాటవుతుందో తెలీని, ఏర్పాటైనా భవిష్యత్తు ఎలాగుంటుందో అంచనాలకు కూడా అందని షర్మిల పార్టీలో చేరి ఈటల ఏమి చేయాలి ? ఈటల రాజకీయ భవిష్యత్తు ఇపుడు ఇన్ స్టంట్ కాఫీ లాగ తయారైపోయింది. స్టౌవ్ మీద కాఫీ పెట్టి కాఫీపొడి+పాలు కలపగానే ఇన్ స్టంట్ కాఫీ అయిపోయినట్లు హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవాలనేది ప్రస్తుతం ఈటల అజెండాగా ఉంది.

రాజీనామా చేసిన తర్వాత ఉపఎన్నిక జరిగి పాజిటివ్ రిజల్టు రావాలంటే ఈటల అయితే కాంగ్రెస్ లో కానీ లేకపోతే బీజేపీలో కానీ చేరాల్సిందే అని డిసైడ్ అయ్యారు. పై రెండు పార్టీల్లో కూడా బీజేపీలో చేరితేనే భవిష్యత్ ఉపయోగాలుంటాయని భావించారు. అందుకనే బీజేపీ అగ్రనేతలను ఢిల్లీ కలిశారు. తక్షణ, దీర్ఘకాలిక రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే షర్మిల పెట్టబోయే పార్టీలో చేరితే జరిగేపనేనా ? కాబట్టి ఈటల తమతో చేయి కలపాలని షర్మిల అనుకోవటం అత్యాసగానే అనిపిస్తోంది.