ఈటల విషయంలో సస్పెన్స్

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికపై సస్పెన్స్ మొదలైంది. రాజీనామా ద్వారా జరగబోయే ఉపఎన్నికలో ఈటలే పోటీచేస్తారా ? లేకపోతే ఆయన భార్య జమునారెడ్డి పోటీచేస్తారా అనే చర్చ మొదలైంది. ఎంఎల్ఏగా రాజీనామా చేయగానే బీజేపీలో చేరాలని ఈటల డిసైడ్ చేసుకున్నారు.

బీజేపీ అభ్యర్ధిగా ఈటల మాత్రమే పోటీ చేయాలని కమలంపార్టీ నేతలు గట్టిగా చెబుతున్నారట. తనకు బదులుగా తన భార్య జమునను పోటీలోకి దింపితే ఉపయోగం ఉండదని బీజేపీ నేతలు ఇప్పటికే ఈటలకు స్పష్టంగా చెప్పారట. భార్యను ఉపఎన్నికలో పోటీ చేయించి గెలిపించుకునే ఆలోచనలో మాజీమంత్రి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

నిజానికి నియోజకవర్గంలో బీజేపీ బలం దాదాపు శూన్యమనే చెప్పాలి. ఈటల నిలబడినా, భార్య నిలబడినా సొంత బలం మీద గెలవాల్సిందే. బీజేపీ నుండి ఓట్ల సహకారం అందుతుందని ఈటల ఏమాత్రం ఆశించేందుకు లేదు. ఇలాంటి నేపధ్యంలో ఎవరు పోటీచేస్తే ఏమిటనేది ఈటల ఆలోచనగా ఉన్నట్లు సమాచారం. అయితే తమ అభ్యర్ధిగా ఈటల పోటీచేస్తేనే ఊపుంటుందని అలాకాదని ఆయన భార్య పోటీచేస్తే ఇంత ఊపుండదనేది కమలనాదుల ఆలోచన.

ఇదే సమయంలో ఈటలను ఎలాగైనా ఓడించాలని కేసీయార్ కూడా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈటల ఇప్పటికప్పుడు రాజీనామా చేసినా ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందనేది ఎవరు చెప్పలేకున్నారు. మామూలుగా అయితే ఆరుమాసాల్లో ఉపఎన్నిక జరగాలి. కానీ ఇపుడు కరోనా వైరస్ తీవ్రత నేపధ్యంలో ఉపఎన్నిక ఎప్పుడు జరుగుతుందో ఎవరు చెప్పలేరు. అందుకనే అందరు ముందుగా ఈటల రాజీనామా తర్వాతే వ్యూహాలు బయటపెట్టాలని అనుకుంటున్నారు. మరి ఈ నేపధ్యంలో ఈటల ఏమి చేస్తారనేది ఆసక్తిగా మారింది.