ఆరు నెలల్లో మూడు సినిమాలు!

నటి సాయిపల్లవికి తెలుగులో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. తన నటన, డాన్స్ తో యూత్ ని ఫిదా చేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఆమె అభిమానుల కోసం బ్యాక్ టు బ్యాక్ థియేటర్లలో సందడి చేయబోతుంది. రాబోయే ఆరు నెలల్లో ఆమె నటించిన మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ముందుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాను రిలీజ్ చేయనున్నారు. చాలాకాలంగా ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఫస్ట్ కాపీ రెడీగా ఉన్నా.. లాక్ డౌన్ కారణంగా ఎదురుచూడాల్సిన పరిస్థితి.

థియేటర్ తెరుచుకున్న వెంటనే.. యాభై శాతం ఆక్యుపెన్సీ అయినప్పటికీ మంచి డేట్ చూసుకొని ఆగస్టు నెలలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమా విడుదలైన కొద్ది గ్యాప్ లోనే ‘విరాటపర్వం’ సినిమా కూడా థియేటర్లోకి రాబోతుంది. రానా ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఆ తరువాత రెండు, మూడు నెలల్లో ‘శ్యామ్ సింగరాయ్’ కూడా రిలీజ్ అవుతుందని అంటున్నారు.

నాని హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమాను ఎట్టిపరిస్థితుల్లో డిసెంబర్ లోపు విడుదల చేయాలనేది నాని ప్లాన్. ఈ సినిమా కంటే ముందుగా నాని నటించిన ‘టక్ జగదీష్’ విడుదలవుతుంది. అంటే ఈ ఏడాది నుండి నాని నుండి రెండు సినిమాలు రాబోతున్నాయన్నమాట. మరోపక్క సాయి పల్లవి నుండి ఆరు నెలల గ్యాప్ లో మూడు సినిమాల వరకు రిలీజయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.