జ‌స్టిస్ ర‌మ‌ణ‌కు చిన్నారి లేఖ‌.. వైర‌ల్ అవుతున్న రిప్ల‌య్ లెట‌ర్‌

ప‌దేళ్ల చిన్నారి.. దేశ స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం.. సుప్రీం కోర్టు ప్ర‌దాన న్యాయ మూర్తి(సీజేఐ) జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ మ‌న‌సు దోచుకుంది. ప్ర‌స్తుతం క‌రోనా నేప‌థ్యంలో సుప్రీం కోర్టు స్పందిస్తున్న తీరును కొనియాడుతూ.. న్యాయ‌మూర్తుల సేవ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ఆమె సీజేఐకి లేఖ రాసింది. అంతేకాదు, న్యాయస్థానం విధి నిర్వహణను వివరించేలా చేతితో గీసిన రంగుల‌ చిత్రాన్ని లేఖతోపాటు జత చేసింది. ఈ లేఖ‌కు ముగ్ధులైన సీజేఐ.. సమాజం పట్ల ఆమె చూపుతున్న శ్రద్ధను మెచ్చుకుంటూ సీజేఐ ఆమెకు రిప్ల‌య్ లెట‌ర్ రాయడంతోపాటు ‘భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని బహూకరించారు.

ఆమె ఎవ‌రు?

త్రిసూర్ కేంద్రీయ విద్యాలయంలో ఐదో తరగతి చదువుతున్న లిడ్వినా జోసఫ్ ఈ లేఖ రాసింది. ఓ ప్రముఖ పత్రికలో భారత దేశంలోని ప్రధాన వార్తలను చదివానని, కరోనా వైరస్ వల్ల ఢిల్లీలోనూ, మిగతా చోట్ల సంభవిస్తున్న మరణాల పట్ల తాను చాలా ఆందోళన చెందుతున్నానని తెలిపింది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో సామాన్యుల బాధలు, మరణాలపట్ల న్యాయస్థానం సమర్థవంతంగా స్పందిస్తున్నట్లు తనకు వార్తా పత్రికల ద్వారా తెలిసిందని పేర్కొంది. ఆక్సిజన్ సరఫరా చేయాలని ఆదేశించి, చాలా మంది ప్రాణాలను కాపాడినందుకు తనకు చాలా సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపింది. దేశంలో, ముఖ్యంగా ఢిల్లీలో, కోవిడ్-19 మహమ్మారిని, దానికి సంబంధించిన మరణాలను తగ్గించడంలో న్యాయస్థానం సమగ్ర చర్యలు తీసుకుందని పేర్కొంది. ఇందుకు సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణకు ధన్యవాదాలు చెప్పింది.

ఈ లేఖతోపాటు లిడ్వినా ఓ వర్ణ రంజితమైన చిత్రాన్ని జత చేసింది. దీనిలో న్యాయమూర్తి తన ముందు ఉన్న బల్లపై ఉన్న కరోనా వైరస్‌ను తన చేతిలోని సుత్తితో పారదోలుతున్నట్లు ఉంది.

సీజేఐ జస్టిస్ రమణ రిప్ల‌య్ లెట‌ర్ ఇదీ..

లిడ్వినా రాసిన లేఖ మే నెలలో సీజేఐ కార్యాలయానికి చేరింది. జస్టిస్ ఎన్‌వీ రమణ సంతోషంతో స్పందిస్తూ, ఆమెకు రిప్ల‌య్ లెట‌ర్ రాశారు. ఆమె పంపిన లేఖ, చిత్రం తనను చాలా ఆకట్టుకున్నట్లు తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో దేశంలో పరిస్థితులను తెలుసుకుంటుండటం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని తెలిపారు. ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపుతున్నందుకు ఆమెను ప్రశంసించారు.

“నువ్వు చురుకైన, సమాచారం స్పష్టంగా తెలిసిన, బాధ్యతాయుతమైన పౌరురాలిగా ఎదుగుతావు. జాతి నిర్మాణానికి విశేషంగా కృషి చేస్తావు” అని లిడ్వినాకు రాసిన లేఖలో జస్టిస్ రమణ పేర్కొన్నారు. సర్వతోముఖ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆమెను దీవించారు. ఈ లేఖతోపాటు ‘భారత రాజ్యాంగం’ పుస్తకాన్ని లిడ్వినాకు పంపించారు. ఈ పుస్తకంపై స్వదస్తూరీతో “విత్ బెస్ట్ విషెస్” అని రాసి, సంతకం చేశారు.