సుశాంత్ మాత్రమే కాదు.. ఆమె కూడా

గత ఏడాది ఇదే సమయానికి అనూహ్యంగా ప్రాణాలు వదిలాడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ఐతే బతికున్నప్పటి కంటే చనిపోయాక సుశాంత్‌కు అభిమానగణం బాగా పెరిగింది. అతడి పట్ల సానుభూతితో, అలాగే తన గురించి కొత్తగా తెలిసిన విషయాలతో అభిమానం మరింత పెంచుకున్నారు జనాలు. ఈ అభిమానమే ఇటీవల కూడా చూపించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ప్రకటించే వార్షిక మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో జాతీయ స్థాయిలో అతడికే అగ్రస్థానం దక్కింది. ఇదేమంత ఆశ్చర్యపోవాల్సిన విషయం కాదు. కానీ సుశాంత్ చనిపోవడానికి ముందు అతడి ప్రేయసిగా ఉన్న రియా చక్రవర్తికి టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో అగ్ర స్థానం దక్కడమే అందరికీ షాకిస్తున్న విషయం. 2020కి ప్రకటించిన టాప్-50 జాబితాలో రియానే నంబర్ వన్‌గా నిలిచింది.

రియా పేరు గత ఏడాది కాలంలో ఎంతో చర్చనీయాంశంగా మారిన మాట వాస్తవం. ఆమె కొన్ని నెలల పాటు వార్తల్లో నిలిచింది. కానీ అదంతా నెగెటివ్‌‌గానే. సుశాంత్ మృతికి పరోక్షంగా రియానే కారణం అన్న ఆరోపణలు, విమర్శలు వినిపించాయి. సుశాంత్‌కు ఆమె డ్రగ్స్ అలవాటు చేసిందని, అతడి డబ్బులు కొట్టేసిందని, అతను డిప్రెషన్లోకి వెళ్లడానికి తనే కారణమని.. ఇలా అనేక ఆరోపణలు వచ్చాయి. సుశాంత్ మృతి కేసులో చాలా రోజుల పాటు ఆమె రిమాండులో ఉంది. బెయిల్ మీద బయటికి వచ్చిన రియా.. ఇప్పటికీ ఈ కేసు నుంచి బయటపడలేదు. మరి ఇలా నెగెటివ్‌గా మీడియాలో ప్రొజెక్ట్ అయిన రియా.. మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టులో అగ్రస్థానంలో

ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీనిపై సోషల్ మీడియా జనాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ఈ జాబితాలో అర్లీన్ కాస్టలినో రెండో స్థానం సాధించగా.. దిశా పఠాని, కియారా అద్వానీ, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ వరుసగా 3, 4, 5, 6 స్థానాల్లో నిలిచారు.