సుకుమార్ రూట్ లో స్టార్ డైరెక్టర్స్!

టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘పుష్ప’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ కథను రెండు భాగాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే మొదటి పార్ట్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తయిందని.. ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని సమాచారం. రెండో భాగం వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా.. ఓ పక్క దర్శకుడిగా సినిమాలు చేస్తోన్న సుకుమార్ మరోపక్క నిర్మాతగా పలు ప్రాజెక్ట్ లను పట్టాలెక్కిస్తున్నారు.

సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఇప్పటికే ‘కుమారి 21 ఎఫ్’, ‘దర్శకుడు’, ‘ఉప్పెన’ లాంటి సినిమాలను నిర్మించిన సుకుమార్ ప్రస్తుతం ’18 పేజెస్’ సినిమాను నిర్మిస్తున్నారు. అలానే లైన్ లో సాయి ధరమ్ తేజ్ సినిమా కూడా ఉంది. ఈ బ్యానర్ లో తన శిష్యులతో పాటు టాలెంట్ ఉన్న దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు సుకుమార్. కేవలం నిర్మించడం వరకు మాత్రమే కాకుండా.. సినిమా అవుట్ పుట్ ఎలా వస్తుందనే దానిపై దృష్టి పెడతారు. కావాలంటే కొన్ని మార్పులు చేర్పులు కూడా చేస్తుంటారు.

ఇప్పుడు సుకుమార్ రూటులోనే కొందరు దర్శకులు సొంత బ్యానర్లను స్థాపించి సినిమాలను నిర్మించబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే కొరటాల శివ సొంతంగా బ్యానర్ మొదలుపెట్టి.. దానిపై కొన్ని సినిమాలను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. రీసెంట్ గా కొందరు దర్శకులకు అడ్వాన్స్ లు ఇచ్చి లాక్ చేసినట్లు తెలుస్తోంది. అలానే ఇండస్ట్రీలో ఉన్న కొందరు దర్శకులు కూడా ఇదే స్ట్రాటజీను ఫాలో అవ్వాలనుకుంటున్నారట. ఈ లెక్కన ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ రావడం ఖాయమనిపిస్తుంది!