రాష్ట్రాల‌పై మోడీ రుస‌రుస‌.. మెత్త‌గానే మొత్తారుగా!

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకుంటున్న నేప‌థ్యంలో , రాష్ట్ర ప్ర‌భుత్వాల నుంచి తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో, దేశ స‌ర్వోన్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టు కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్న స‌మ‌యంలో.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అనూహ్యంగా జాతి ముందుకు వ‌చ్చారు. సుమారు అర‌గంట సేపు ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా రాష్ట్రాల‌పై మోడీ మెత్త‌ని మాట‌ల‌తో ఎదురు దాడి చేయ‌డం గ‌మ‌నార్హం.

మేం మోస్తున్నాం..
వాస్త‌వానికి ప్ర‌జారోగ్యం రాజ్యాంగంలో రాష్ట్రాల బాధ్య‌త‌గానే ఉంద‌న్న మోడీ.. క‌రోనా విష‌యంలో రాష్ట్రాల‌కు కేంద్రం ఎంతో ఉదార‌త‌తో ముందుకు వ‌చ్చి సాయం చేస్తోంద‌ని చెప్పారు. వైద్య రంగంలో మౌలిక వ‌స‌తులు పెంచామ‌ని, రాష్ట్రాల‌కు అనేక ప్రోత్సాహ‌కాలు ఇచ్చామ‌ని తెలిపారు. అవ‌స‌ర‌మైన మందుల ఉత్పత్తి పెంచామ‌ని చెప్పుకొచ్చారు. కేంద్రం ముందు చూపుతో వ్యాక్సిన్ త‌యారు చేయ‌కుంటే మ‌రిన్ని ఇబ్బందులు ఉండేవ‌ని మోడీ వ్యాఖ్యానించారు.

రుస‌రుస‌లు..
క‌రోనా క‌ట్ట‌డికి కేంద్రంలోని త‌మ ప్ర‌భుత్వం ఎంతో చేస్తున్నా.. రాష్ట్రాల నుంచి, విప‌క్షాల నుంచి విమ‌ర్శ‌లు రావ‌డం త‌న‌ను క‌ల‌చి వేసింద‌ని మోడీ అన్నారు. టీకా విష‌యంలో రాష్ట్రాలు మాట మార్చాయ‌ని మోడీ దుయ్య‌బ‌ట్టారు. టీకాల‌ను ముందు తామే కొనుగోలు చేస్తాయ‌ని రాష్ట్రాలు చెప్పాయ‌న్నారు. ఆ త‌ర్వాత చేతులు ఎత్తేశాయ‌ని.. ఇక దీనిపై విప‌క్షాల‌ది అన‌వ‌స‌ర రాద్ధాంతంగా మోడీ కొట్టిపారేశారు. వ్యాక్సిన్ ల‌భ్య‌త‌ను బ‌ట్టి.. ప్ర‌జ‌ల‌కు అంద‌రికీ అందిస్తామ‌ని చెప్పారు.

ప్రైవేటుకు 25%
దేశంలో ఉత్ప‌త్తి అవుతున్న, విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్న టీకాల్లో ప్రైవేటు ఆసుప‌త్రుల‌కు 25% టీకాల‌ను కేటాయించ‌నున్న‌ట్టు ప్ర‌ధాని మోడీ చెప్పుకొచ్చారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో రూ.150కే వ్యాక్సిన్ వేసేలా రాష్ట్రాలు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు. అంతేకాదు, రాష్ట్రాలు ఇక నుంచి టీకాల‌పై పైసా కూడా ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం లేదన్నారు. వ్యాక్సిన్ విష‌యంలో అనేక అనుమానాలు, అపోహ‌లు ప్ర‌చారం అయ్యాయ‌న్న మోడీ.. అనేక మంది దీనిపై త‌ప్పుడు ప్ర‌చారం చేశారని ఒకింత మౌనంగానే ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.