రామ్ కోసం భలే విలన్


‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో యువ కథానాయకుడు రామ్ తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాడు. అప్పటిదాకా రామ్ సినిమా అంటే 10-15 కోట్ల బడ్జెట్.. సినిమా హిట్టయితే 20-25 కోట్ల మధ్య కలెక్షన్లు అన్నట్లుండేది వ్యవహారం. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ దాదాపు రూ.40 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. దీంతో రామ్ మీద పెద్ద బడ్జెట్లు పెట్టి భారీ సినిమాలు తీయొచ్చన్న భరోసా నిర్మాతలకు కలిగింది.

ఇప్పుడు తమిళ దర్శకుడు లింగుస్వామి డైరెక్షన్లో రామ్ చేస్తున్న బహు భాషా చిత్రం అలాంటిదే. దీని మీద రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. కాస్టింగ్, టెక్నికల్ సపోర్ట్ కూడా కొంచెం ఘనంగానే ఉండేలా చూసుకుంటున్నారు. ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టిని ఈ చిత్రానికి కథానాయికగా ఎంచుకోగా.. ఒక పవర్ ఫుల్ విలన్ కోసం చూస్తున్నారు.

ముందు తమిళ నటుడు అరుణ్ విజయ్‌ పేరును ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఐతే అరుణ్‌కు తెలుగులో అంతగా పేరు లేదు. మన వాళ్లకు కూడా బాగా పరిచయం ఉన్న నటుడైతే బాగుంటుందని ఇప్పుడు మాధవన్ వైపు చూస్తున్నాడట లింగుస్వామి. ‘వేట్టై’ రూపంలో తనకు పెద్ద హిట్టిచ్చిన లింగుస్వామి అడిగితే.. అతను కాదనకపోవచ్చు. ప్రస్తుతం మాధవన్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయని.. దాదాపుగా అతనే ఖరారయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మాధవన్‌కు తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది కానీ.. ఒక్కటే సమస్య. అతను ఇంతకుముందు తెలుగులో నెగెటివ్ రోల్స్ చేసిన సవ్యసాచి, నిశ్శబ్దం చిత్రాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. మరి ఆ నెగెటివ్ సెంటిమెంటును పట్టించుకోకుంటే రామ్-మాధవన్ మధ్య హోరాహోరీని చూసే అవకాశం దక్కుతుంది ప్రేక్షకులకు.