ఖిలాడి రీమేక్ కాదు.. కానీ

ర‌వితేజ హీరోగా ర‌మేష్ వ‌ర్మ రూపొందిస్తున్న ఖిలాడి మూవీ రీమేక్ అనే ప్ర‌చారం ఆ సినిమా మొద‌లైన‌ప్ప‌ట్నుంచి న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళంలో అర‌వింద్ స్వామి, త్రిష జంట‌గా న‌టించిన శ‌తురంగ వేట్టై-2 ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కిన‌ట్లు వార్త‌లొచ్చాయి. ఐతే ర‌మేష్ వ‌ర్మ తాజాగా ఒక ఇంట‌ర్వ్యూలో ఈ విష‌య‌మై క్లారిటీ ఇచ్చాడు. ఖిలాడి రీమేక్ కాద‌ని అత‌ను స్ప‌ష్టం చేశాడు.

కాక‌పోతే శ‌తురంగ వేట్టై-2 పేరెత్త‌లేదు కానీ.. స్టోరీ లైన్ ప‌రంగా ఓ త‌మిళ సినిమాతో దీనికి పోలిక ఉంటుంద‌ని ర‌మేష్ చెప్ప‌డం విశేషం. ఇంట‌ర్వెల్ దగ్గ‌ర కీల‌క మ‌లుపు చూసిన వాళ్ల‌కు త‌మిళ సినిమాను పోలి ఉంటుంద‌ని అత‌న‌న్నాడు. ఈ చిత్ర ర‌చ‌యిత త‌న‌తో ఈ విష‌యం చ‌ర్చించాడ‌ని, నిర్మాత‌తో కూడా మాట్లాడిన త‌ర్వాతే సినిమాను మొద‌లుపెట్టామ‌ని ర‌మేష్ తెలిపాడు.

ర‌వితేజ చివ‌రి సినిమా క్రాక్ రిలీజ్ కావ‌డానికి ముందే ఖిలాడి షూటింగ్ 40 శాతం పూర్త‌యింద‌ని.. క్రాక్ పెద్ద హిట్ట‌యింది క‌దా అని ఖిలాడి స్క్రిప్టులో మ‌ళ్లీ మార్పులేమీ చేయ‌లేద‌ని, ముందు అనుకున్న స్క్రిప్టుతోనే షూటింగ్ కొన‌సాగించామ‌ని.. ప్ర‌స్తుతం సినిమా టాకీ పార్ట్ దాదాపు పూర్తి కావ‌చ్చింద‌ని ర‌మేష్ తెలిపాడు.

ఈ సినిమాకు సుజీత్ వాసుదేవ‌న్ ఛాయాగ్రాహ‌కుడ‌ని, 90 శాతం షూటింగ్ వ‌ర‌కు అత‌నే ఉన్నాడ‌ని, ఐతే వేరే సినిమా కోసం అత్య‌వ‌స‌రంగా వెళ్లాల్సి ఉండ‌టంతో మిగ‌తా 10 శాతం షూటింగ్ బాధ్య‌త‌ను క్రాక్ సినిమాటోగ్రాఫ‌ర్ జీకే విష్ణుకు అప్ప‌గించామ‌ని ర‌మేష్ చెప్పాడు. ఖిలాడి సినిమాలో ర‌వితేజ డబుల్ రోల్ చేస్తున్నాడా అని అడిగితే.. ఇందులో మాస్ రాజా ఎన్ని పాత్ర‌లు చేస్తున్నాడు, ఆ పాత్ర‌ల తాలూకు విశేషాలేంటి అనేది ఇప్పుడు చెప్ప‌న‌ని.. సినిమా రిలీజ‌య్యే వ‌ర‌కు వేచి చూడాల్సిందే అని, ఈ చిత్రంతో ర‌వితేజ‌ సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డం ఖాయ‌మ‌ని అత‌న‌న్నాడు.