ప్రతిపక్షాలపైకి తోసేసిన కేంద్రం

దేశంలో టీకాల కార్యక్రమం నెమ్మదించటానికి ఎన్డీయే యేతర ప్రభుత్వాలే కారణమని చాలా సింపుల్ గా కేంద్రప్రభుత్వం తేల్చేసింది. కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించిన జాబితాలో ఉన్న రాష్ట్రాలన్నీ కాంగ్రెస్ లేదా ఏన్డీయే యేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాలే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నరేంద్రమోడి సర్కార్ విఫలమైందన్న ఆరోపణలున్న విషయం అందరికీ తెలిసిందే. నిజానికి అవి ఆరోపణలు మాత్రమే కాదు అందులో చాలా వరకు నిజాలున్నాయి.

అయితే ఆరోపణలనుండి మోడిని రక్షించేందుకు కేంద్ర ఆర్దికశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు అర్ధమవుతోంది. ఆర్ధికశాఖ ప్రకటించిన రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, రాజస్ధాన్, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఢిల్లీ, చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, తెలంగాణా, పంజాబ్ ఉన్నాయి. వీటిలో రాజస్ధాన్, చత్తీస్ ఘడ్, పంజాబ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఝార్ఖండ్, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్రలో ఎన్డీయే యేతర పార్టీలున్నాయి.

నిజానికి టీకాల కార్యక్రమం మొదలైనప్పటి నుండి కేంద్ర నిర్ణయాలు అపసవ్యంగానే ఉన్నాయి. టీకాల కార్యక్రమం కోసం కేంద్రం రూపొందించిన కోవిన్ యాప్ పనితీరులోనే చాలా లోపాలున్నాయి. గంటల తరబడి కాదు రోజులతరబడి పనిచేయని సందర్భాలున్నాయి. యాప్ ఓపెన్ అవటానికే చాలా సమయం పడుతోంది. ఒకవేళ ఓపెన్ అయి స్లాట్ బుక్ చేయాలన్నా, సెంటర్ ను ఎంపిక చేసుకోవాలంటే చాలా సమయం పడుతోంది.

45 ఏళ్ళు దాటినివారికి కేంద్రమే టీకాలు వేయించిన తర్వాత 18-45 ఏళ్ళవాళ్ళకు రాష్ట్రాలే సేకరించి టీకాలను వేయించాలని చెప్పటంతోనే సమస్యలు మొదలయ్యాయి. అలాగే టీకాల కొనుగోలులో కేంద్రానికి ఒకధర, రాష్ట్రాలకు మరోధర నిర్ణయించటంతోనే రెండో సమస్య మొదలైంది. ఇదే సమయంలో కంపెనీల నుండి టీకాలను రాష్ట్రాలు సమీకరించాలని అనుకున్నా కేంద్రం పెత్తనం ఉండటం వల్ల సక్సెస్ కాలేదు. ఇదే సమయంలో అవసరానికి సరిపడా టీకాలను కంపెనీలు ఉత్పత్తి చేయలేక చేతులెత్తేశాయి.

లోపాల్లో కేంద్రానిదే ప్రధాన బాధ్యతగా కనిపిస్తున్నా కేంద్రం మాత్రం రాష్ట్రాలదే కారణమని తోసేయటం విచిత్రంగా ఉంది. టీకాల కార్యక్రమం ఫెయిలవ్వటానికి, కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత పెరిగిపోవటానికి ఎవరు కారణమనే విషయంలో జనాలకు స్పష్టత బాగానే ఉంది. కాబట్టి తప్పులన్నింటికీ మీరే కారణమంట కాదు మీరే కారణమని కేంద్రం-రాష్ట్రాలు ఒకదానిపై మరొకటి తోసేసుకోవటం వల్ల ఉపయోగాలుండవని గ్రహించాలి.