సీఎం జ‌గ‌న్ సానుభూతి కోస‌మే ఇలా – నారాయణ

ఏపీ సీఎం జ‌గ‌న్ వైఖ‌రిపై రాష్ట్ర రాజ‌కీయ నేత‌లు జోరుగా చ‌ర్చిస్తున్నారు. అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు పూర్త‌యిన త‌ర్వాత‌.. ఆయ‌న వైఖ‌రిలో అనూహ్య‌మైన మార్పు చోటు చేసుకుంద‌ని నాయ‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. ఎన్న‌డూ లేనిది.. ఆయ‌న రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల‌కు లేఖ‌లు రాస్తుండ‌డాన్ని వైసీపీ మిన‌హా అన్ని పార్టీల నేత‌లు..’సానుభూతి కోస‌మే ఇలా చేస్తున్నారు’ అని వ్యాఖ్యానిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఈ క్ర‌మంలో తొలుత‌గా సీపీఐ సీనియ‌ర్ నాయ‌కుడు నారాయ‌ణ నోరు విప్పారు. ముఖ్యమంత్రి జగన్ తీరుపై నారాయణ విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ల కోసం ఒకే స్వరం వినిపిద్దామంటూ సీఎంలకు లేఖలు రాసిన జగన్‌.. ప్రధాని మోడీని విమర్శిస్తూ జార్ఖండ్‌ సీఎం హేమంత్ చేసిన‌ ట్వీట్‌ను ఎందుకు తప్పుపట్టారని ప్రశ్నించారు. తిరుపతిలో మాట్లాడిన ఆయన.. జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నందున.. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

‘కేసుల విషయంలో జరగబోయే పరిణామాల నుంచి బయటపడేందుకే జగన్ వ్యాక్సిన్ల పేరుతో సీఎంలకు లేఖ రాశారు. నిజంగా వ్యాక్సిన్లపై చిత్తశుద్ధి ఉంటే జార్ఖండ్ సీఎంను ఎందుకు తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, జీఎస్టీతో పాటు ప్రజావ్యతిరేక విధానాల అంశాల్లో కేంద్రంపై ఎందుకు పోరాటం చేయటం లేదు…? కేంద్రంపై పోరాడే విషయంలో జగన్కు చిత్తశుద్ధి లేదు అని నారాయణ దుయ్య‌బ‌ట్టారు.

ఇక‌, ఇదే విష‌యంపై టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయ్య‌న్న పాత్రుడు కూడా స్పందించారు. సీఎం జ‌గ‌న్‌కు ప్ర‌జ‌ల‌పై అంత ప్రేమ ఉంటే.. వ్యాక్సిన్‌ల కోసం ఇన్నాళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్ర‌ధాని మోడీని ఎందుకు వెనుకేసుకు వ‌స్తున్నారు? ఇదంతా పెద్ద డ్రామా. త‌న‌పై ఉన్న కేసుల విష‌యంలో బెయిల్ ర‌ద్ద‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నందునే ఇలా చేస్తున్నారు.. అని అయ్య‌న్న ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి సీఎం లేఖ‌ల విష‌యం రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతున్న విష‌యం గ‌మ‌నార్హం.