హరీష్ కోసం వేటూరితో బాలు రాయబారం

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి అప్పుడే ఎనిమిది నెలలు గడిచిపోయింది. బాలు లేకుండా తొలిసారి జూన్ 4న ఆయన పుట్టిన రోజును జరుపుకున్నారు అభిమానులు. మామూలు రోజుల్లో అయితే ఆయన పుట్టిన రోజు ఫ్యాన్స్ అందరికీ గుర్తుండేది కాదు. కానీ ఆయన మరణానంతరం తొలి పుట్టిన రోజు కావడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులు ఆయన్ని గుర్తు చేసుకున్నారు.

కొందరు మనసులో ఆయన్ని తలుచుకుని నివాళి అర్పిస్తే.. ఇంకొందరు ఆయన మీద సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారు. ఇక సంగీత కుటుంబానికి చెందిన చాలామంది బాలుకు నివాళిగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. తెలుగు సినీ పరిశ్రమ విషయానికి వస్తే.. తనికెళ్ల భరణి, ఎన్.శంకర్ తదితరులు కలిసి ఓ టీవీ ఛానెల్ సహకారంతో వర్చువల్ లైవ్ ప్రోగ్రాం పెట్టారు. ఇందులోకి అనేకమంది ప్రముఖులను ఆహ్వానించి బాలు పాటతో వారి అనుబంధం గురించి మాట్లాడించారు.

ఈ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్.. బాలు గురించి తనదైన శైలిలో మాట్లాడి అభిమానులను ఆకట్టుకున్నారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకుండా శంకరాభరణం, సాగర సంగమం సినిమాల పాటలను పాడటం అసాధారణమని.. బాలు ఎన్ని పురస్కారాలు అందుకున్నప్పటికీ ఈ సినిమాలు ఆయనకు తెచ్చిన గౌరవం ముందు ఏవీ నిలబడవని హరీష్ అన్నాడు. తాను చిన్నపుడు సినిమాలకు వెళ్లినపుడు వాటి హీరోలే పాటలు పాడుతున్నారు అనుకునేవాడినని.. కానీ హీరోల నప్పేట్లు బాలునే పాటలు పాడతాడని తర్వాత తెలిసిందని.. ప్రపంచంలో ఇలా హీరోల వాయిస్‌కు తగ్గట్లుగా పాటలు పాడిన ఏకైక గాయకుడు బాలునే అని హరీష్ పేర్కొన్నాడు.

‘సాగర సంగమం’లో కమల్ అన్నట్లుగా చేసిన పని ద్వారా రససిద్ధి కలగడం అన్నది బాలు విషయంలో చూశామని.. అలాంటి లెజెండ్‌తో దర్శకుడిగా తన తొలి సినిమాకే పని చేయడం తన అదృష్టమని అన్నాడు హరీష్. తన డెబ్యూ మూవీ ‘షాక్’ కోసం బాలుతో మధురం మధురం పాట పాడారని హరీష్ గుర్తు చేసుకున్నాడు. ఈ పాటను వేటూరి రచించారని.. ఐతే పాట మధ్యలో ఒక పదం కొంచెం అభ్యంతరకరంగా అనిపిస్తే వేటూరికి ఎలా చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డానని.. వేటూరికి కాల్ చేసి బాలుకు ఫోన్ ఇస్తే ఆయన తనదైన శైలిలో వేటూరితో మాట్లాడి అప్పటికప్పుడు ఆ పదం మార్చి ‘హృదయం’ అని చేర్చారని హరీష్ చెప్పాడు. “కొత్త కుర్రాడు. తొలి సినిమా చేస్తున్నాడు. అప్పుడే అతడికి ఎందుకు ఇవ్వన్నీ” అంటూ వేటూరితో తమాషాగా మాట్లాడి ద్వంద్వార్థం ధ్వనించే ఆ పదాన్ని మార్పించారని హరీష్ గుర్తు చేసుకున్నాడు.