ఈటలపై విమర్శలు.. పల్లా మాటల ఆంత్యరం అదేనా..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసే క్రమంలో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఎవరో ఏదో చెప్పారని.. రాత్రికి రాత్రే తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారని ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం పోగొట్టుకోవడం ఇష్టం లేక తాను పార్టీని వీడుతున్నట్లు కూడా చెప్పారు.

అయితే.. అలా ఈటల రాజీనామా ప్రకటించాడో లేదో.. ఇలా టీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి చేయడం మొదలుపెట్టారు. ఆత్మగౌరవం కాదు.. ఆస్తుల రక్షణ కోసమే ఈటల టీఆర్ఎస్ ని వీడి బీజేపీలో చేరుతున్నారంటూ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. నిజంగా ఈటలకు ఆత్మగౌరవమే ఉంటే.. పేదల ఆస్తులను లాక్కోరని పల్లా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది నాయకులను కేసీఆర్ నాయకులుగా చేశారని పేర్కొన్నారు.

ఇదంతా బాగానే ఉంది కానీ.. ఈటల బీజేపీలో చేరటానికి కారణం ఇదేనంటూ పల్లా చెప్పిన మాటలే ఇప్పుడు దుమారం రేపేలా కనపడుతున్నాయి. కేవలం తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల బీజేపీలో చేరుతున్నారనేది పల్లా అభిప్రాయం. అదే నిజం అని కాసేపు అనుకుంటే.. అక్రమాస్తులు ఉన్నవారంతా బీజేపీలో చేరితే..వాళ్లని ఎవరూ ఏమీ చేయలేరా అనే ప్రశ్న ఎక్కువగా వినపడుతుంది.

నిజంగా ఈటల చేసింది తప్పే అయితే.. దానిపై చర్యలు తీసుకునే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుంది కదా..? బీజేపీలో చేరాడు కదా.. అని వారి జోలికి వెళ్లరా..? ఇదెక్కడి వాదన అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందా అనే చర్చ కూడా మొదలైంది.

ప్రతిపక్షంలోని నేతలు ఎవరైనా అలా మాట్లాడి ఉంటే అర్థం మరోలా ఉండేది.. కానీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న నాయకుడే ఇలా మాట్లాడటంతో అందరికీ అనుమానాలు మొదలౌతున్నాయి. మరి పల్లా మాటల వెనక అసలు ఆంతర్యం ఏమిటో..?