‘ఫ్యామిలీ మ్యాన్-2’ వివాదం.. అసలేం చూపించారు?

ఈ రోజే ప్రేక్షకుల భారీ అంచనాల మధ్య ముందుకు వచ్చింది ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ రెండో సీజన్. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా కంటెంట్ ఉందంటూ అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఐతే ఈ సిరీస్ ఎలా ఉందన్నది పక్కన పెడితే.. తమిళ జనాలు అభ్యంతర పెట్టినట్లుగా వివాదాస్పదంగా ఉందా అన్న ప్రశ్న కూడా అందరినీ వెంటాడుతోంది.

ఈ సిరీస్‌లో సమంత చేసిన రాజి పాత్ర చుట్టూ వివాదం ముసురుకున్న సంగతి తెలిసిందే. ఆమె తమిళ ఈలం (ఎల్టీటీఈ) సభ్యురాలి పాత్రను పోషించగా.. ఎల్టీటీఈ, పాకిస్థాన్ ఉగ్రవాదాలు కలిసి పని చేసినట్లుగా ట్రైలర్లో చూపించడంపై తమిళనాడు నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసే లంకేయులతో కలిసి ఉండలేమని, తమకు వేరే రాజ్యం కావాలని పోరాడిన తమిళ టైగర్లను ఉగ్రవాదులుగా చూపించడమేంటన్నది వాళ్ల అభ్యంతరం.

ఈ కారణంతోనే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ను నిషేధించాలంటూ డిమాండ్లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ వెళ్లింది. ఈ నేపథ్యంలో నిజంగా ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో తమిళ టైగర్లను చెడుగా చూపించారా అన్న సందేహంతో అందరూ ఉన్నారు. ఐతే నిజానికి ఈ సిరీస్‌లో తమిళ టైగర్లను నెగెటివ్ కోణంలో ఏమీ చూపించలేదు. లోతుగా కాకపోయినా వాళ్ల బాధల్ని, కష్టాల్ని చర్చించే ప్రయత్నం జరిగింది. వారి కోణంలో కథను చెప్పే ప్రయత్నమూ జరిగింది. కాకపోతే ఇందులో వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం మాత్రం జరిగింది.

తమిళ టైగర్లు ఎప్పుడూ కూడా పాకిస్థాన్ ఉగ్రవాదులతో కలిసి పని చేసింది లేదు. ఉగ్రవాదులతో కలిసి పని చేస్తే వీళ్లూ ఉగ్రవాదులే అవుతారు. ‘ఫ్యామిలీ మ్యాన్-2’ కల్పిత కథ అని చెబుతున్నప్పటికీ.. ఇందులో చూపించింది ఎల్టీటీఈ గురించే. సమంత అందులో సభ్యురాలిగానే కనిపించింది. శ్రీలంక ప్రస్తావన చాలాచోట్ల కనిపిస్తుంది. కాబట్టి కల్పిత కథ అని చెబుతూ వాస్తవాల్ని వక్రీకరించే ప్రయత్నం చేసినట్లుగానే భావించాలి. ఐతే ఇందులో తమిళ టైగర్ల పట్ల సానుభూతి కనిపించింది కాబట్టి తమిళులు మన్నిస్తారేమో చూడాలి. లేదంటే మాత్రం వివాదం పెద్దది కావడం ఖాయం.