మూడో దశ ఇంత తీవ్రంగా ఉంటుందా ?

కరోనా వైరస్ మూడో దశ అంచనాలు యావత్ దేశాన్ని వణికించేస్తోంది. మొదటి దశ కన్నా రెండోదశ తీవ్రత దేశంపై ఎంతటి దుష్ఫలితాలను చూపించిందో అందరు చూస్తున్నదే. సెకెండ్ వేవ్ తీవ్రత నుండే బయటపడటానికి నానా అవస్తలు పడుతుంటే అప్పుడే మూడో దశ ప్రభావంపై ఆందోళన పెరిగిపోతోంది. మిగిలిన దేశం విషయం ఎలాగున్నా మన ఏపి పైన మాత్రం గట్టి ప్రభావాన్నే చూపే అవకాశం ఉందని చిన్నపిల్లల వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

మూడో దశలో 25 శాతం మంది పిల్లలకు కరోనా వైరస్ సోకే ప్రమాధముందని నిపుణులు అంచనా వేశారు. 18 ఏళ్ళలోపు పిల్లలు ఏపిలో సుమారు కోటిమంది ఉంటారని అంచనా. వీరిలో 25 శాతం అంటే 25 లక్షల మందికి కరోనా సోకుతుందనే అంచనా వేయటమంటే మామూలు విషయం కాదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుగానే చిన్న పిల్లల వైద్య నిపుణులతో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసింది. వైరస్ నియంత్రణకు సూచనలు ఇవ్వమని కోరింది.

టాస్క్ ఫోర్స్ కమిటి ఛైర్మన్ డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి దశలోనే దేశం మొత్తంమీద 12 శాతం మంది పిల్లలకు వైరస్ సోకిందన్నారు. మూడో వేవ్ ఉంటుందని కచ్చితంగా చెప్పేందుకు లేకపోయినా ఒకవేళ వస్తే అనే ఉద్దేశ్యంతోనే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఒకవేళ 25 శాతంమందికి వైరస్ సోకినా వీరిలో 6 శాతం పిల్లలు మాత్రమే ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఉంటుందని అభిప్రాయపడ్డారు.

ఆసుపత్రుల్లో చేరిన వారిలో కూడా 1 శాతం మందికి మాత్రమే ఐసీయు అవసరం అవ్వచ్చని వీరిలో కూడా 0.6 శాతం లోపే మరణాలుండే అవకాశం ఉందన్నారు. మహారాష్ట్రలోని ఒకచోట కొన్ని వేలమందికి కరోనా వైరస్ సోకినా అక్కడ మరణాలు లేవట. అదే విషయమై తమ నిపుణులు అధ్యయనం చేస్తున్నట్లు ఛైర్మన్ చెప్పారు. పిల్లలకు వైరస్ సోకినపుడు ఉపయోగించాల్సిన ఇంజెక్షన్లు ప్రస్తుతం 300 ఉన్నాయన్నారు.

అలాగే పిల్లల వైద్య నిపుణులు రాష్ట్రంలో 600 మందున్నారట. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్ల నుండి వివిధ స్ధాయిలోని డాక్టర్ల వివరాలను సేకరిస్తున్నారట. కమిటి ఛైర్మన్ చెప్పిన దాని ప్రకారం మూడో వేవ్ కరోనా వస్తే ఎదుర్కోవటానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉందని అర్ధమవుతోంది. సెకెండ్ వేవ్ తీవ్రతలో బయటపడిన లోపాలను సర్దుబాటు చేసుకుని మూడో వేవ్ తీవ్రతను నియంత్రణలో ఉంచగలిగితే అందరికీ మంచిదే కదా.