ప‌వ‌న్ కోసం సెట్టింగ్స్ రెడీ అవుతున్నాయ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏదో అనుకుంటే ఇంకేదో అయింది. రాజ‌కీయాల్లో కొన‌సాగుతూనే.. కాస్త వీలు చేసుకుని చ‌క‌చ‌కా కొన్ని సినిమాలు చేసేయాల‌ని ప‌వ‌న్ ప్లాన్ చేసుకున్నాడు. అందులో భాగంగానే కేవ‌లం 30 రోజుల కాల్ షీట్లు ఇచ్చి వ‌కీల్ సాబ్ సినిమాను పూర్తి చేయాల‌ని టార్గెట్ పెట్టుకున్నాడు. క్రిష్ సినిమా కోసం ఇంకాస్త ఎక్కువ క‌ష్ట‌ప‌డ‌టానికి సిద్ధ‌మ‌య్యాడు. ఈ రెండు చిత్రాల్ని ఈ ఏడాదే పూర్తి చేయాల‌న్నది ప‌వ‌న్ ప్లాన్.

అంతా అనుకున్న ప్ర‌కారం జ‌రిగితే ఈపాటికి వ‌కీల్ సాబ్ రిలీజ్ కూడా అయి ఉండాల్సింది. కానీ క‌రోనా వ‌చ్చి ప‌డి అన్ని ప్ర‌ణాళిక‌ల్ని నాశ‌నం చేసింది. మ‌ళ్లీ షూటింగ్స్ ఎప్పుడు మొద‌ల‌వుతాయో తెలియ‌దు. మొద‌ల‌య్యాక వ‌కీల్ సాబ్‌కు సంబంధించి అయితే వారం ప‌ది రోజుల పాటు ప‌వ‌న్ ప‌ని చేస్తే స‌రిపోతుంది.

ఆ త‌ర్వాత క్రిష్ సినిమా కోసం కొంచెం గ‌ట్టిగా ప‌ని చేయాల్సి ఉంటుంది ప‌వ‌న్. మ‌ళ్లీ షూటింగ్స్ మొద‌ల‌య్యే స‌మ‌యానికి ఏం చేయాల‌నే విష‌యంలో చిత్ర బృందం ప‌క్కా ప్రణాళిక‌తో రెడీ అవుతున్న‌ట్లు స‌మాచారం. చారిత్ర‌క నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం నార్త్ ఇండియాకు వెళ్లాల‌నుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ మారింది.

ఎలాంటి స‌న్నివేశాలైనా స‌రే.. రామోజీ ఫిలిం సిటీలో సెట్టింగ్స్ వేసుకుని అక్క‌డే చిత్రీక‌ర‌ణ జ‌ర‌పాల‌ని.. అలా కాకుంటే సినిమా చాలా లేటైపోతుంద‌ని భావిస్తున్నార‌ట‌. ద‌ర్శ‌కుడు క్రిష్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ క‌లిసి ఫిలిం సిటీలో ప‌ర్య‌టించి కొన్ని ప్రాంతాల్ని ఎంచుకుని.. అక్క‌డ ఎలాంటి సెట్లు వేయాలో ప్లాన్ గీసేశార‌ట‌. మ‌ళ్లీ షూటింగ్స్ ఆరంభ‌మ‌య్యాక ప‌వ‌న్ కొన్ని రోజులు వ‌కీల్ సాబ్ కోసం ప‌ని చేస్తాడు. ఈ గ్యాప్‌లో సెట్లు తీర్చిదిద్దుకునే ప‌నిలో ప‌డుతుంది క్రిష్ టీం. త‌ర్వాత ప‌వ‌న్ రాగానే వేగంగా షూటింగ్ చేయాల‌న్న‌ది ప్ర‌ణాళిక‌.