వామ్మో… ఆక్సిమీటర్ ద్వారా వేలిముద్రలతో సైబర్ మోసాలు


క‌రోనా స‌మ‌యంలో ఓ వైపు ఈ మ‌హ‌మ్మారి క‌లిగిస్తున్న షాకుల‌కు ఎప్పుడు బ్రేకులు ప‌డుతాయో అని ఆందోళ‌న చెందుతుంటే ఇదే స‌మ‌యంలో చుక్క‌లు చూపించే అంశాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. క‌రోనా స‌మ‌యంలో కొన్ని ప్రైవేటు ఆస్ప‌త్రుల దోపిడికి బ్రేకులు ప‌డ‌ట్లే. దీనికి సైబ‌ర్ మోస‌గాళ్లు కూడా తోడ‌య్యారు. క‌రోనా స‌మ‌యంలో ఎక్కువ‌గా చోటుచేసుకున్న ఆక్సిమీట‌ర్ వినియోగం ద్వారా దోచుకుంటున్నారు. నకిలీ ఆక్సీమీట‌ర్ల ద్వారా మ‌న బ్యాంకు ఖాతాల నుంచి డ‌బ్బు దోచుకుంటున్నారు.

అమాయకుల నుంచి డ‌బ్బు కొల్లగొట్టేందుకు సైబర్‌ నేరగాళ్లు కరోనా కాలాన్ని కూడా వినియోగించుకుంటున్నారు. ఆక్సిమీటర్ల ద్వారా వల విసురుతున్న ఈ నేర‌గాళ్లు తాము తయారుచేస్తున్న ఆక్సిమీటర్లను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. ఈ ఆక్సిమీటర్లలో వారు ఒక కార్డ్‌ రీడర్‌ను అమరుస్తూ మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ఆక్సిమీటర్ వాడిన సమయంలో వినియోగదారులు కచ్చితంగా దానిలో తమ వేలుపెట్టి ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకుంటారు. ఆ సమయంలోనే వీరి వేలిముద్రలు అందులోని కార్డ్‌రీడర్లోకి వెళ్లిపోతాయి. అయితే ఇక్క‌డే ఒక ట్విస్టు.

ఈ సైబ‌ర్ మోస‌గాళ్లు విక్రయించే ఆక్సిమీటర్‌ 15 రోజులే పనిచేస్తుంది! దానిని అమ్మే సమయంలోనే.. ‘ఏదైనా సమస్య వస్తే.. ఆక్సిమీటర్‌ను రీప్లేస్‌ చేస్తాం’ అని వారు హామీ ఇస్తారు. ధర ఎక్కువపెట్టి కొనుగోలు చేసిన వినియోగదారుడు అది చెడిపోగానే తిరిగి వీరినే సంప్రదించాల్సి వస్తుంది. ఇలా ఆక్సిమీటర్‌ చెడిపోయిందని ఫోన్‌ చేయగానే వాళ్లు వచ్చి పాతది తీసుకొని కొత్తవి ఇస్తారు. వెనక్కి తీసుకున్న ఆక్సిమీటర్‌లోని కార్డ్‌రీడర్లను వెలికితీసి వాటిలోని మన వేలిముద్రలను సేకరిస్తారు. ఆ తర్వాత డార్క్‌నెట్‌ లేదా ఇతర వ్యక్తుల ద్వారా సిమ్‌ కార్డు డాటాను తీసుకుంటారు. ఆ డాటాలో మన వేలు ముద్రలను బట్టి మన ఫోన్ నంబర్లను సేకరిస్తారు. దీంతోపాటుగా ఆధార్‌ సమాచారం తీసుకుంటారు. వీటి ద్వారా వారికి మన బ్యాంక్‌ ఖాతాల వివరాలు తెలిసిపోతాయి. అలా వారు బ్యాంక్‌ ఖాతాలను జల్లెడ పట్టి వాటి ద్వారా డబ్బును దోచేందుకు కుట్రలు పన్నుతుంటారు. ఇలా ఆన్‌లైన్‌లో ఆక్సిమీటర్లు కొనుగోలుచేసిన వారి బ్యాంకు ఖాతాలు ఖాళీ అయిన కేసులు ఇటీవల భారీగా నమోదవుతున్నాయని నివేదిక‌లు వ‌స్తున్నాయి. అందుకే బీ కేర్ ఫుల్‌.