బాహుబలి తర్వాత స్ట్రగుల్ అవుతోన్న బాలీవుడ్కి 'టాయ్లెట్' చిత్రంతో కాస్త ఉపశమనం దక్కింది. ఆ చిత్రం మొదటి వారంలో బాగా వసూలు చేయడంతో మరో బ్లాక్బస్టర్ వచ్చేసినట్టే అనుకున్నారు. అయితే రెండవ వారంలో డ్రాప్ అయిన ఆ చిత్రం హిట్తో సరిపెట్టుకుంది.
టాయ్లెట్ హిట్ అయి బాహుబలి జింక్స్ పోగొట్టింది కదా అనుకుంటూ వుంటే శుక్రవారం విడుదలైన 'ఏ జెంటిల్మేన్' చిత్రం డిజాస్టర్ అయింది. మొదటి మూడు రోజుల్లో కేవలం పన్నెండు కోట్ల నెట్ వసూళ్లతో ఈ చిత్రం డిజాస్టర్ దిశగా పయనిస్తోంది.
కనీసం శని, ఆదివారాల్లో కూడా బిజినెస్ పరంగా గ్రోత్ లేకపోయేసరికి ఇది ఇక బతికి బట్ట కట్టడం ఇంపాజిబుల్ అని ట్రేడ్ తేల్చేసింది. యువతరం హీరోల్లో స్టార్గా ఎదుగుతాడనే నమ్మకం కలిగించిన సిద్ధార్థ్ మల్హోత్రాకి 'బార్ బార్ దేఖో' తర్వాత మరో పెద్ద ఫ్లాప్ తగిలింది. కానీ భవిష్యత్తు గురించి చింతించాల్సిన పని లేకుండా సిద్ధార్థ్ మలి చిత్రాన్ని కరణ్ జోహార్, షారుక్ ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇత్తెఫాక్ చిత్రానికి రీమేక్ అయిన ఈ చిత్రంతో పాటు నీరజ్ పాండే డైరెక్షన్లో ఐయారీ చిత్రంలో చేస్తున్నాడు. రెండూ క్రేజీ ప్రాజెక్టులే కనుక ఈ డబుల్ డిజాస్టర్ సిద్ధార్థ్ని అంతగా ఎఫెక్ట్ చేయకపోవచ్చు. బాలీవుడ్ నుంచి వచ్చిన ఏ చిత్రం ఈ ఏడాదిలో ఇంతవరకు కనీసం నూట ముప్పయ్ కోట్ల నెట్ వసూళ్లని దాటకపోవడం మాత్రం అందరినీ తెగ కలవరపెడుతోంది.