ఆనందయ్య మందుకి బ్రేక్.. కృష్ణపట్నంలో కరోనా కేసులు..!

మొన్నటి వరకు అక్కడ ఒక్క కరోనా కేసు కూడా లేదు. ఆ గ్రామస్థులంతా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. కరోనా తమను ఏమీ చేయలేదనే ధీమాతో ఉన్నారు. తమ గ్రామస్థుడు ఆనందయ్య ఇచ్చే మందు తమకు అందుబాటులో ఉండగా.. కరోనా తమను ఏం చేయలేదని ఊపిరిపీల్చుకున్నారు.

ఇదే విషయాన్ని చుట్టుపక్కల గ్రామస్థులు కూడా నమ్మారు. అందుకే ఆ ఆనందయ్య కరోనా మందు కోసం కుప్పలు తెప్పలుగా ఎగబడ్డారు. ఈ విషయం కాస్త.. ప్రభుత్వం దృష్టికి రావడం.. ఆ మందు నిజంగా అంత అద్భుతంగా పనిచేస్తుందా అనే సందేహాలు రావడం మొదలైంది. అంతే.. దానిపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు ఈ మందు పంపిణీ చేయడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. అంతే.. ఆనందయ్య మందు పంపిణీకి బ్రేక్ పడింది.

ఈ విషయమంతా మనకు తెలిసిందే. అయితే.. మొన్నటి వరకు ఒక్క కరోనా కేసు కూడా లేని ఆ కృష్ణపట్నంలో ఇప్పుడు కరోనా కేసులు రావడం మొదలయ్యాయి. పలువురు గ్రామస్థులు కరోనా లక్షణాలతో ఇబ్బంది పడటం అధికారుల దృష్టికి వచ్చింది. ఎందుకైనా మంచిదని.. ర్యాపిడ్ టెస్టులు చేయగా.. ఇద్దరికి పాజిటివ్ గా తేలింది.

వీరు కాగా.. మరో 27 మందిలో స్వల్పంగా కరోనా లక్షణాలు కనపడ్డాయి. దీంతో.. వారిందరికీ కరోనా టెస్టులు చేసి.. వాటిని నెల్లూరు జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ రోజు వాటి ఫలితాలు తెలియనున్నాయి. ఇంత సడెన్ గా అక్కడ కరోనా కేసులు నమోదవ్వడం గ్రామస్థులను కలవరపెడుతోంది.

ఆనందయ్య మందు పంపిణీ లేకపోవడం వల్లే.. తమ గ్రామస్థులు కరోనా బారినపడుతున్నారని అక్కడివారు భావిస్తుండటం గమనార్హం. కాగా.. కరోనా మందు కోసం.. మొన్నటి వరకు కుప్పలుతెప్పలుగా.. వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. వారి కారణంగానే ఇప్పుడు కృష్ణపట్నంలో కేసులు నమోదౌతున్నాయా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఆనందయ్య మందు పంపిణీపై త్వరలోనే క్లారిటీ రానుంది.