చిన్మ‌యి పెళ్లిలో వైర‌ముత్తు.. కొత్త వివాదం

త‌మిళ‌, తెలుగు ప‌రిశ్ర‌మ‌ల్లో మంచి పేరున్న గాయ‌ని, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మ‌యి శ్రీపాద‌.. త‌మిళ లెజెండ‌రీ లిరిసిస్ట్ వైర‌ముత్తు మీద మూడేళ్ల కిందట చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎంతగా సంచలనం రేపాయో తెలిసిందే. వైరముత్తు మీద ఆమె అప్పట్నుంచి అలుపులేని పోరాటం చేసింది. వైరముత్తుపై ఆమె కేసులు కూడా పెట్టగా.. ఇప్పటిదాకా అయితే ఆయనపై ఎలాంటి చర్యలూ చేపట్టలేదు.

బహుశా ఎన్నో ఏళ్ల కిందట జరిగిన విషయాలకు సంబంధించి ఇప్పుడు చిన్మయి ఆధారాలు ఇవ్వలేకపోవడం వల్ల ఈ కేసులు నిలవలేకపోయి ఉండొచ్చు. ఐతే వైరముత్తు ప్రతిష్ఠను దెబ్బ తీయడంలో మాత్రం చిన్మయి విజయవంతం అయిందనే చెప్పాలి. తాజాగా కేరళకు చెందిన ఓఎన్వీ అకాడమీ వైరముత్తుకు సాహిత్య పురస్కారం ప్రకటించడంపై ఎంత వివాదం నడుస్తోందో తెలిసిందే. చివరికి తనకీ అవార్డు వద్దంటూ వైరముత్తు వెనక్కిచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

ఈ వివాదం ఇలా ఉంటే.. మరో వైరముత్తు-చిన్మయిలకు సంబంధించి గొడవ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. వైరముత్తుపై ఇన్ని ఆరోపణలు చేసిన చిన్మయి.. తన పెళ్లికి ఆయన్ని స్వయంగా ఆహ్వానించడమే కాక.. ఆయన వచ్చినపుడు ఆశీర్వాదాలు తీసుకోవడం ఏంటనే ప్రశ్న ఆమెకు గతంలో ఎదురైంది. ఐతే తాను ఆయన్ని పెళ్లికి పిలవాలనుకోలేదని.. వైరముత్తు కొడుకు, లిరిసిస్ట్ మదన్ కార్కీనే ఆయన్ని పిలవాలని కోరడంతో ఆహ్వానించాల్సి వచ్చిందని చిన్మయి వెల్లడించింది.

దీనిపై మదన్ తాజాగా స్పందించాడు. చిన్మయి అబద్ధాల కోరని.. పెళ్లికి పిలిచేందుకు తన తండ్రి అపాయింట్మెంట్ అడిగితే ఇప్పించానని, తానేమీ తన తండ్రిని చిన్మయి పెళ్లికి పిలవాలని కోరుకోలేదని అన్నాడు. తన తండ్రిపై చిన్మయి చేస్తున్న ఆరోపణలను తాను నమ్మట్లేదని అతను స్పష్టం చేశాడు. దీనిపై చిన్మయి ఘాటుగా స్పందించింది. తాను వైరముత్తు వేధింపుల గురించి మదన్‌కు చెబితే.. ఆయన అలాంటివాడే అని తమ కుటుంబానికి తెలుసని.. ఈ విషయంలో తనకే మద్దతు ఇస్తున్నట్లు కూడా మదన్ అప్పట్లో చెప్పాడని.. కానీ ఇప్పుడు మాట మార్చేస్తున్నాడని.. అతణ్ని నమ్మడం తన పొరబాటని చిన్మయి పేర్కొంది.