వ్యాక్సిన్ కోసం ఫేక్ ఐడీ.. చిక్కుల్లో పడ్డ హీరోయిన్!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా రోజుకి లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటే కరోనా సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెప్పడంతో జనాలు వ్యాక్సిన్ కోసం ఎగబడుతున్నారు. అయితే సెలబ్రిటీలకు, రాజకీయనాయకులకు దొరికినంత తేలికగా వ్యాక్సిన్ లు సామాన్య ప్రజలకు దొరకడం లేదనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా నటి మీరా చోప్రా ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీసింది.

తెలుగులో ‘బంగారం’ అనే సినిమాలో నటించిన మీరాచోప్రా ఆ తరువాత ‘మారో’, ‘వాన’ వంటి సినిమాల్లో కనిపించారు. తెలుగుతో పాటు తమిళంలో అలానే హిందీ సినిమాల్లో నటించారు. ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ట్విట్టర్ లో ఎప్పటికప్పుడు రాజకీయ అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా మీరా చోప్రా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని పోస్ట్ పెట్టింది.

అయితే ఆమె ఫ్రంట్లైన్ వారియర్ కోటాలో ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలియడంతో బీజేపీ ప్రభుత్వం మండిపడుతోంది. మీరాచోప్రా థానేలోని పార్కింగ్ ప్లాజా వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఓం సాయి ఆరోగ్య కేర్ ప్రయివేట్ లిమిటెడ్ లో ఆమె సూపర్ వైజర్ గా పని చేస్తున్నట్లుగా ఓ ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. రూల్స్ ను అతిక్రమించి ఇలాంటి పని చేసినందుకు గాను ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీ కోరుతోంది. ఈ విషయంపై స్పందించిన థానే మున్సిపల్ కార్పొరేషన్.. విచారణ చేస్తున్నామని, ఆరోపణలు రుజువైతే మీరా చోప్రాపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. విషయం సీరియస్ అవుతుందని భావించిన మీరా.. ఇన్స్టాగ్రామ్ నుండి వ్యాక్సినేషన్ పోస్ట్ ను తొలగించింది.