ఆనంద‌య్య మందులో కీల‌క అప్‌డేట్‌… తుది నిర్ణ‌యం ఎప్పుడంటే…

క‌రోనా మందు పంపిణీతో కొంత‌, దాని చుట్టూ ముసిరిన వివాదంతో మ‌రెంతో ప్రాచుర్యాన్ని సంపాదించిన నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య ఔష‌ధంపై ఇంకా ట్విస్టుల మీద ట్విస్టులు కొన‌సాగుతున్నాయి. ఆనంద‌య్య మందుపై వ్య‌క్త‌మైన అభిప్రాయాల నేప‌థ్యంలో విచార‌ణ సంస్థ‌లు త‌మ ప‌రీశీల‌న కొన‌సాగిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో, ఔష‌ధం పంపిణీపై ఓ ప్ర‌చారం మొద‌లైంది. దీని పై స్వ‌యంగా ఆనంద‌య్య క్లారిటీ ఇవ్వాల్సి వ‌చ్చింది.

ఆనంద‌య్య మందు పంపిణీకి రంగం సిద్ధ‌మైంద‌ని నేటి నుంచి పంపిణీ చేస్తార‌ని ఓ మెసేజ్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.ఈ నేప‌థ్యంలో ఓ వీడియో ద్వారా ఆనంద‌య్య స్పందించారు. నేటి నుంచి ఔష‌ధం పంపిణీ చేస్తార‌ని సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న పుకార్లు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆనంద‌య్య తెలిపారు. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి రాగానే మందు తిరిగి పంపిణీ చేస్తామ‌ని, ఈ మేర‌కు తాము ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు. అప్ప‌టివ‌ర‌కు ఎటువంటి వాట్సాప్ మెసేజ్ లు న‌మ్మ‌వ‌ద్ద‌ని ఆనంద‌య్య కోరారు.

ఇదిలా ఉండ‌గా, ఆనందయ్య మందు తీసుకున్న వారిలో ఏవైనా ప్రతికూల ప్రభావాలు ఉన్నాయా? లేవా? అని తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఐసీఎంఆర్‌తో పాటు ఆయుర్వేద వైద్య నిపుణులతో కమిటీ వేసిన విషయం తెలిసిందే. వైద్య బృందం విచారణ పూర్తి చేసింది. తిరుపతి ఎస్వీ ఆయుర్వేద కళాశాల, విజయవాడ ప్రాంతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ సంయుక్త కమిటీ సభ్యులు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న 570 మంది వివరాలను సేకరించి.. వారిలో 380 మందితో స్వ‌యంగా మాట్లాడారు.

కరోనా రాకుండా ఉండేందుకు, పాజిటివ్‌ వచ్చాక మందు తీసుకున్న వారు, ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయిన తరువాత మందు తీసుకున్న వారితో వివరంగా మాట్లాడారు. మందు తీసుకున్న తరువాత పాజిటివ్‌ ఎవరికైనా వచ్చిందా? లేదా?, అనారోగ్య సమస్యలు తలెత్తాయా? వంటి వివరాలను సేకరించారు. ఇందులో మెజార్టీ ఆనంద‌య్య మందుకు అనుకూలంగానే చెప్పిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా, నివేదికను సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ ఆయుర్వేదిక్‌ సైన్సెస్‌‌కు పంపించారు.