ఆ హీరోను మళ్లీ తీసేశారు

ప్యార్ కా పంచనామా, సోనూ కే టిటు కీ స్వీటీ లాంటి చిత్రాలతో బాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించిన యువ కథానాయకుడు కార్తీక్ ఆర్యన్.. ఈ మధ్య ఓ నెగెటివ్ అప్‌డేట్‌తో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ నిర్మాణంలో ‘దోస్తానా 2’ లాంటి భారీ చిత్రం నుంచి అతను అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అతడిపై 20 రోజులకు పైగా షూటింగ్ జరిపారు. ఐతే స్క్రిప్టు విషయంలో అభ్యంతరాలు చెప్పడం, మరేవో కారణాలతో అతణ్ని ఈ చిత్రం నుంచి సాగనంపేశాడు కరణ్.

సినిమా మధ్యలో ఇలా హీరోను తప్పించడం వల్ల కోట్లు నష్టం వాటిల్లుతున్నప్పటికీ.. కరణ్ తగ్గలేదు. కార్తీక్ తీరు పట్ల ఆయనకు అంతగా కోపం వచ్చింది. అదేదో అనుకోకుండా జరిగిపోయింది, కార్తీక్ ఇక జాగ్రత్తగా ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో పెద్ద సినిమా నుంచి అతను బయటికొచ్చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

షారుఖ్ ఖాన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బేనర్లో తెరకెక్కుతున్న ‘ఫ్రెడ్డీ’ సినిమాకు కూడా కార్తీక్ ఆర్యన్ దూరమయ్యాడు. ఈ సినిమా నుంచి అతణ్ని తప్పించారా.. తనే బయటికొచ్చేశాడా అన్నదానిపై స్పష్టత లేదు. ఈ సినిమా స్క్రిప్టు విషయంలోనూ కార్తీక్ అభ్యంతరాలు చెప్పడంతోనే సాగనంపేశారని అంటున్నారు. సినిమాకు సంతకం చేసేటపుడు అంతా ఓకే అని.. ఇప్పుడు మధ్యలో అభ్యంతరాలు చెప్పడంతో మేకర్స్ అతడికి గుడ్ బై చెప్పేశారంటున్నారు. ఈ సినిమా కోసం తీసుకున్న రూ.2 కోట్ల అడ్వాన్సును అతను వెనక్కి ఇచ్చేశాడట.

ఐతే ఈ సినిమా షూటింగ్ ఆరంభ దశలో ఉండగానే లాక్ డౌన్ వచ్చి పని ఆపేశారు. దీని వల్ల హీరోను తప్పించడం వల్ల చిత్ర బృందానికి పెద్దగా ఇబ్బంది లేకపోయింది. ఇప్పుడతడి స్థానంలో మరో హీరోను తీసుకుని లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇలా స్వల్ప వ్యవధిలో పెద్ద బేనర్లలో తెరకెక్కుతున్న రెండు చిత్రాలకు దూరం కావడం కార్తీక్ కెరీర్‌కు పెద్ద ఎదురు దెబ్బ అనడంలో సందేహం లేదు.