ఆమె రేంజ్ ఇలా పడుతోందేంటి?


మూడేళ్ల కిందట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘అజ్ఞాతవాసి’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో ‘నా పేరు సూర్య’ లాంటి భారీ చిత్రాల్లో నటించిన కథానాయిక అను ఇమ్మాన్యుయెల్. తెలుగులో చిన్న సినిమాలతో ప్రయాణం మొదలుపెట్టినప్పటికీ.. తక్కువ వ్యవధిలో బడా స్టార్ల సరసన భారీ చిత్రాల్లో నటించిందామె. ఆ రెండు చిత్రాల మీదా భారీ అంచనాలుండటంతో అవి హిట్టయితే అను రేంజే మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ‘అజ్ఞాతవాసి’, ‘నా పేరు సూర్య’ పెద్ద డిజాస్టర్లయి అనుకు నెగెటివ్ ఇమేజ్ తెచ్చిపెట్టాయి.

నాగచైతన్య సరసన చేసిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సైతం నిరాశకు గురి చేసింది. ఆ తర్వాత ఆమెను తమ సినిమాల్లోకి తీసుకోవడానికి దర్శక నిర్మాతలు జడిశారు. దీంతో ఈ మలయాళ కుట్టి కెరీర్ తలకిందులు అయిపోయింది. కనీసం మిడ్ రేంజ్ స్టార్లకు జోడీగా కూడా ఆమెకు అవకాశాలు దక్కలేదు. చాలా తక్కువ వ్యవధిలో ఫేడ్ అవుట్ అయిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

చివరగా అను తెలుగులో చేసిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. అందులో హీరో బెల్లంకొండ శ్రీనివాస్. పవన్, బన్నీ లాంటి స్టార్ల సరసన చేసిన రెండేళ్లకే అను.. శ్రీనివాస్‌కు జోడీగా చేయాల్సి రావడం, పైగా ఆ సినిమాలో ఆమె లీడ్ హీరోయిన్ కూడా కాకపోవడం తనకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అను స్థాయికి ఆ చిత్రమే చాలా తక్కువ అనుకుంటే.. ఇప్పుడు మరో మెట్టు కిందికి దిగిందామె. అల్లు శిరీష్‌కు జోడీగా అను ఓ సినిమా చేస్తున్న విషయం తాజాగా వెల్లడైంది.

ఈ నెల 30న శిరీష్ పుట్టిన రోజు నేపథ్యంలో మూడు రోజుల ముందు అతడి కొత్త సినిమా కబురు చెప్పారు. గీతా ఆర్ట్స్2 బేనర్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఓ కొత్త దర్శకుడు దీన్ని రూపొందిస్తున్నాడు. శిరీష్‌తో అను రొమాన్స్ చేస్తున్న ఓ దృశ్యంతో ప్రి లుక్ రిలీజ్ చేశారు. ఇది చూసి అల్లు అర్జున్ సరసన చేసిన అమ్మాయికి ఇప్పుడు శిరీష్‌తో సర్దుకుపోవాల్సిన పరిస్థితి వచ్చిందే అని అను ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కాలం కలిసి రానపుడు ఎవరైనా ఏం చేస్తారు మరి?