13 ఏళ్ల ముందు నాటి యాడ్.. ఇప్పుడు వైరల్


శర్వానంద్ హీరోగా మారుతి తీసిన ‘మహానుభావుడు’ సినిమాలో హీరో పాత్ర దేన్ని ముట్టుకున్నా వెంటనే చేతులకు శానిటైజర్ రాసేసుకోవడం అందరికీ చిత్రంగా అనిపించింది. కానీ మూడేళ్లు తిరిగాక ఇండియాలో ప్రతి ఒక్కరూ ఇలా శానిటైజర్ రాసుకునే పరిస్థితి వచ్చింది. మారుతి అప్పుడే భవిష్యత్ దర్శనం చేయించాడంటూ అందరూ ‘మహానుభావుడు’ సినిమాలోని సన్నివేశాలను గుర్తు చేసుకోవడం చూశాం.

కాగా ఇలాగే 13 ఏళ్ల ముందు వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను చూపించడం విశేషం. అభిషేక్ బచ్చన్ మీద అప్పట్లో ఐడియా వాళ్లు తీసిన ‘వాట్ ఎన్ ఐడియా సర్ జీ’ యాడ్ ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. అందులో ఒక యాడ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం విశేషం. సరిగ్గా ఇప్పుడు చూస్తున్న పరిస్థితులే అప్పుడు ఆ యాడ్‌లో కనిపించడం విశేషం.


ఆ యాడ్‌లో అభిషేక్ టీచర్ పాత్రలో కనిపిస్తాడు. ఓ పల్లెటూరి పేద అమ్మాయికి స్కూల్లో అడ్మిషన్ దొరక్క వెనక్కి వెళ్లిపోతుంటే.. ఆ అమ్మాయి ఉండే పల్లెటూరిలోని పిల్లలందరికీ మొబైల్ ఇంటర్నెట్ ద్వారా ఆన్ లైన్ పాఠాలు చెప్పించడం.. ఆ తర్వాత ఆ అమ్మాయి బెస్ట్ స్టూడెంట్‌గా అవార్డు అందుకోవడం.. ఈ ప్రకటనలో చూస్తాం. మధ్యలో ఇంటర్నెట్ ద్వారా పిల్లలకు టీచర్ పాఠాలు చెప్పే సన్నివేశాలు చాలా సరదాగా ఉంటాయి.

మొబైల్ ఇంటర్నెట్ అంతగా పాపులర్ కాని ఆ రోజుల్లో ఈ యాడ్ చూసిన వాళ్లకు ఇలా నిజంగా జరుగుతుందా అనిపించి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ పల్లెటూళ్లకూ వెళ్లిపోయింది. అందరూ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. పైగా కరోనా-లాక్ డౌన్ పుణ్యమా అని ఏడాదిగా సిటీలు, పల్లెటూళ్లు అని తేడా లేకుండా అన్ని చోట్లా ఆన్ లైన్ పాఠాలే శరణ్యం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి పరిస్థితులను అప్పుడే ఊహించి ఈ యాడ్ భలేగా తీర్చిదిద్దారే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.