త‌గ్గేదే లేద‌బ్బా!.. రాజుగారు మ‌రో లేఖాస్త్రాన్ని సంధించారు!

న‌ర‌సాపురం ఎంపీ, వైసీపీ రెబ‌ల్ నేత ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఎంత‌మాత్రం త‌గ్గిన‌ట్టుగా క‌నిపించ‌డం లేదు. త‌న పుట్టిన రోజున కావాల‌నే టార్గెట్ చేసిన‌ట్టుగా త‌న‌ను జ‌గ‌న్ స‌ర్కారు అరెస్ట్ చేస్తే… త‌న‌దైన శైలిలో జ‌గ‌న్ స‌ర్కారుపై ఓ రేంజిలో విరుచుకుప‌డ్డ ర‌ఘురామ‌రాజు… పోలీసుల క‌స్ట‌డీలో ఉంటూనే న్యాయ పోరాటం సాగించారు. త‌న‌ను అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టించారు. అంతేకాకుండా త‌న‌పై సీఐడీ పోలీసుల క‌స్ట‌డీలో ఉండ‌గానే… ముఖానికి మాస్కులు ధ‌రించిన వ్య‌క్తులు త‌న‌పై భౌతిక దాడికి దిగార‌ని స్వ‌యంగా సీఐడీ కోర్టు న్యాయ‌మూర్తికి పిర్యాదు చేసిన రాఘురామ‌రాజు పెను సంచ‌ల‌నం రేపారు. ఈ దాడిలో త‌న కాలికి గాయాల‌య్యాయ‌ని, వాటి ఫొటోలు బ‌య‌ట‌కు వ‌చ్చేలా చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించిన ర‌ఘురామ‌రాజు… జ‌గ‌న్ స‌ర్కారుకు పెద్ద షాకే ఇచ్చారు. తొలుత హైకోర్టు, ఆ త‌ర్వాత సుప్రీంకోర్టు గ‌డ‌ప తొక్కిన ర‌ఘురామ‌రాజు ఎట్ట‌కేల‌కు బెయిల్ తెచ్చుకున్నారు.

ర‌ఘురామ‌రాజుకు బెయిల్ వ‌చ్చినా… అనివార్య కార‌ణాల వ‌ల్ల మ‌రో రెండు, మూడు రోజుల దాకా ఆయ‌న బ‌య‌ట‌కు వ‌చ్చే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. జ‌గ‌న్ స‌ర్కారును ముప్పుతిప్ప‌లు పెట్టిన ర‌ఘురామ‌రాజు.. తాను అనుకున్న‌ట్లుగా గుంటూరులోని ర‌మేశ్ ఆస్ప‌త్రిలో చికిత్స చేయించుకోలేక‌పోయినా… సుప్రీంకోర్టు ఆదేశాల‌తో సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆస్ప‌త్రిలో చికిత్స అందుకుంటున్నారు. ఆస్ప‌త్రిలో ఉన్నా… ర‌ఘురామ‌రాజు ఏమాత్రం త‌గ్గిన‌ట్టుగా క‌నిపించ‌లేదు. అరెస్ట్ కాక‌ముందు నిత్యం ర‌చ్చ‌బండ పేరిట జ‌గ‌న్ స‌ర్కారుపై త‌న‌దైన శైలిలో విరుచుకుప‌డ్డ ర‌ఘురామ‌రాజు… ప్ర‌స్తుతం ఆర్మీ ఆస్ప‌త్రిలో ఉన్నా జ‌గ‌న్ స‌ర్కారుపై ఆరోప‌ణ‌లు గుప్పించే ప‌నిని మాత్రం విడిచిపెట్ట‌డం లేద‌నే వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

అయినా ఇప్పుడు ర‌ఘురామ‌రాజు ఏం చేశార‌న్న విష‌యానికి వ‌స్తే… త‌న ఆరోగ్య ప‌రిస్థితిపై ఆర్మీ ఆస్ప‌త్రి క‌మాండ‌ర్ కు ఓ లేఖ రాసిన ఆయ‌న‌.. జ‌గ‌న్ స‌ర్కారును ఇరికించేలా ఆ లేఖ‌లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ లేఖ‌లో ర‌ఘురామ‌రాజు ఏమ‌ని పేర్కొన్నారంటే…పెయిన్ కిల్లర్స్, యాంటీ బయోటెక్స్ వాడుతున్నాను. నా కాలి నొప్పి ఇంకా తగ్గలేదు. బీపీలో కూడా హెచ్చుదల కనిపిస్తోంది. నోరు కూడా తరచుగా పొడారిపోతుంది. రెండు, మూడు రోజులు ఆస్పత్రిలోనే డాక్టర్ల పర్యవేక్షణలో నాకు చికిత్స అందించాలి. అయినా మీరు డిశ్చార్జ్ చేయాలనుకుంటే.. డిశ్చార్జ్ సమ్మరీలో నా ఆరోగ్య పరిస్థితిని స్పష్టంగా తెలియజేయండి. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఏపీకి చెందిన కొందరు పోలీసులు ఆస్పత్రి దగ్గర ఉన్నట్లు తెలుస్తోంది అంటూ ర‌ఘురామ‌రాజు స‌ద‌రు లేఖ‌లో ఏపీ పోలీసుల తీరుపై ఆర్మీ ఆస్ప‌త్రి క‌మాండ‌ర్ కు ఫిర్యాదు చేశారు.