రామ్ చరణ్ పాత్ర చనిపోతుందా?

ఇంతకుముందు రామ్ చరణ్ నటించిన ‘మగధీర’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి చిన్న క్యామియో రోల్ లాంటిది చేశాడు. అది తప్పితే ఈ తండ్రీ కొడుకులిద్దరూ ఇప్పటిదాకా కలిసి నటించింది లేదు. ఐతే ఇప్పుడు ‘ఆచార్య’ కోసం వీళ్లిద్దరూ జట్టు కట్టారు. చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చరణ్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.

ఆ క్యారెక్టర్ దాదాపు నలభై నిమిషాల నిడివితో ఉంటుందని సమాచారం. ఈ పాత్రకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆమెతో చరణ్‌కు ఒక పాట కూడా ఉంది. ఈ పాత్ర నిడివి ఎంత అన్నది ముఖ్యం కాదని, కథలో దాని ప్రాధాన్యత ఏంటో చూడాలని అంటున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఒక రకంగా చెప్పాలంటే ‘ఆచార్య’ కథ ఆ పాత్రదే అని.. ఆ పాత్ర తాలూకు కథను చిరంజీవి పూర్తి చేస్తాడని అన్నాడు కొరటాల. చరణ్ పాత్ర ద్వితీయార్ధంలో వస్తుందని, కథంతా ఆ పాత్ర చుట్టూనే తిరుగుతుందని కొరటాల చెప్పాడు.

ఐతే కొరటాల మాటల్ని బట్టి చూస్తుంటే.. చరణ్ పాత్ర సినిమాలో చనిపోతుందేమో అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ‘ఆచార్య’ కథ ఆ పాత్రదే అని.. ఐతే దాన్ని చిరంజీవి పూర్తి చేస్తాడని కొరటాల అంటున్నాడు. బహుశా ఒక కాజ్ కోసం విలన్ల మీద చరణ్ పాత్ర పోరాడి, వాళ్ల చేతిలో చనిపోతే.. ఆ తర్వాత చిరు పాత్ర లీడ్ తీసుకుని విలన్ల కథ ముగించి సమస్యను పరిష్కరించేలా కథ ఉండొచ్చనే అభిప్రాయం కలుగుతోంది. చరణ్ పాత్ర మధ్యలో ముగిసిపోతుందన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.

‘ఆచార్య’లో చిరు, చరణ్ చేస్తున్నది తండ్రీ కొడుకుల పాత్రలు కావని కొరటాల స్పష్టం చేశాడు. మరి ఇప్పుడున్న అంచనాలకు తగ్గట్లే చరణ్ పాత్ర ఉంటుందా.. లేక కొరటాల తెరపై భిన్నంగా ఏమైనా చూపిస్తాడా అన్నది చూడాలి. చరణ్ పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తయినట్లే ఉంది. చరణ్-పూజా హెగ్డేల మీద తీసిన నీలాంబరి పాటను చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లో రిలీజ్ చేయబోతుండటం విశేషం.