ఫుడ్ డెలివరీ రచ్చ.. రంగంలోకి కేటీఆర్

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తెలంగాణ లో లాక్ డౌన్ అమలు చేస్తున్న ప్రభుత్వం ఫుడ్ డెలివరీని అత్యవసర సేవల్లో పరిగణించడం తెలిసిందే. దీంతో జొమాటో, స్విగ్గీ లాంటి ఫుడ్ డెలివరీ సంస్థలు గత ఏడాది లాక్ డౌన్ టైంలో మాదిరే ఇప్పుడూ పని చేస్తూ వచ్చాయి. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు వినియోగదారులకు సేవలు అందిస్తున్నాయి.

హోటళ్లన్నీ మూత పడ్డ నేపథ్యంలో ఇంట్లో వంట వండుకునే సదుపాయం లేని వాళ్లకు ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లే దిక్కు. మొన్నటిదాకా వీటికి ఏ ఆటంకమూ లేకపోయింది. ఫుడ్ డెలివరీ బాయ్స్ ఏ ఇబ్బందీ లేకుండా సేవలు అందించారు. కానీ శనివారం ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయాయి. హైదరాబాద్ సిటీలో అన్ని చోట్లా ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. కొన్ని చోట్ల బాయ్స్ మీద లాఠీఛార్జీలు కూడా చేశారు. దీని పట్ల సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.

ఎసెన్షియల్ సర్వీస్‌ల్లో ఫుడ్ డెలివరీని చేర్చి ఇప్పుడు ఉన్నట్లుండి డెలివరీ బాయ్స్‌ మీద ఈ జులుం ఏంటి అంటూ ప్రశ్నలు రేకెత్తాయి. కాగా జొమాటో, స్విగ్గీ సంస్థలు ఫుడ్ డెలివరీని ఆపేస్తున్నట్లుగా ప్రకటనలు చేశాయి. దీంతో వీటి మీదే ఆధారపడ్డ తమ పరిస్థితి ఏంటంటూ హైదరాబాద్ వాసులు సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు పెట్టారు.

దీంతో కేటీఆర్ కూడా స్పందించక తప్పలేదు. ఫుడ్ డెలివరీ బాయ్స్‌ను అడ్డుకోవడం పై తనకు అనేక ఫిర్యాదులు అందాయని.. దీని గురించి రాష్ట్ర డీజీపీతో మాట్లాడి సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. కాగా కేటీఆర్ ఇలా ట్వీట్ చేసిన కొన్ని గంటలకే డీజీపీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్లు పడ్డాయి. లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్న నేపథ్యంలో ఫుడ్ డెలివరీ సంస్థలను కూడా ఆపాల్సి వచ్చిందని… దీనిపై సమీక్ష జరుపుతున్నామని పేర్కొన్నారు. దీనిపై ఆదివారం మరోసారి సమీక్ష జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సేవలను సోమవారం నుంచి పునరుద్ధరించే అవకాశాలు ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.