రాజు లేడు.. ఆ ట్వీట్లు ఇక ఉండవు

టాలీవుడ్ సీనియర్ జర్నలిస్టు, పీఆర్వో, నిర్మాత బీఏ రాజు హఠాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఇది పరిశ్రమకు ఊహించని షాక్. ఎందుకంటే చనిపోవడానికి నాలుగు గంటల ముందు కూడా ఆయన మామూలుగా ఉన్నారు. ఎప్పట్టాగే ట్విట్టర్లో ఒక పోస్టు పెట్టారు. ఫ్రభాస్ నటించిన ‘అడవి రాముడు’ సినిమా విడుదలై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమా పాత పోస్టర్లు, అలాగే ఆ చిత్రంలోని సూపర్ హిట్ పాటల గురించి ఆ పోస్టు పెట్టారు.

బీఏ రాజు ఫాలోవర్లకు చాలా ఇష్టమైన టెంప్లేట్ పోస్టు ఇది. టాలీవుడ్లో ఇంకెవరూ ఈ పని చేయలేరు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఎప్పుడు 60 ఏళ్ల ముందు విడుదలై సినిమాకు సంబంధించి అప్పటి పోస్టర్లు బయటికి తీసి, ఆ సినిమా విశేషాలు పంచుకోవడం రాజుకే చెల్లు. టాలీవుడ్లో ఆయన దగ్గరున్నంత సినిమా సమాచారం ఇంకెవరి దగ్గరా లేదు అన్నా ఆశ్చర్యం లేదు.

సంతాప సందేశంలో చిరంజీవి అన్నట్లు రాజు సినిమాలకు సంబంధించి ఒక నడిచే ఎన్‌సైక్లోపీడియా. దాదాపు తెలుగు సినీ పరిశ్రమ మొదలైన దగ్గర్నుంచి మెజారిటీ సినిమాల సమాచారం ఆయన దగ్గరుంది. గూగుల్లో వెతికి సమాచారం సేకరించి పోస్ట్ చేయడం కాదు. తన దగ్గరే ఒక లైబ్రరీ మెయింటైన్ చేస్తున్నారాయన. పాత సినిమాలకు సంబంధించి అప్పటి పోస్టర్లు, పత్రికా ప్రకటనలన్నీ సేకరించి పెట్టుకున్న రాజు.. వాటిని డిజిటలైజ్ చేయించారు. ఆయా చిత్రాల మేకర్స్ దగ్గర కూడా లేని సమాచారం రాజు దగ్గర ఉండటం విశేషం.

ఏదో సమాచారం చదువుకుని, వెతుక్కుని మాట్లాడటం కాదు.. పాత సినిమాలు వేటి గురించి అడిగినా.. అనర్గళంగా, ఆశువుగా మాట్లాడగలగడం రాజు ప్రత్యేకత. ఈ పరిజ్ఞానంతోనే ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో పాత సినిమాల వార్షికోత్సవాల సమయంలో పోస్టులు పెడుతుంటారు. అవి చూసి ఫాలోవర్లు నోస్టాల్జిక్ ఫీలింగ్‌లోకి వెళ్తుంటారు. ఇకపై రాజు నుంచి ఇలాంటి పోస్టులు ఉండవు అనే ఆలోచనే ఫాలోవర్లను ఎంతగానో బాధిస్తోంది.