టీడీపీ కోట‌ల్ని కూల్చిన వంశీ-అవినాష్.. !

కృష్ణా జిల్లా పూర్తిగా వైసీపీ వశమైపోతుందా? కంచుకోటలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అవుతుందా ? అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే అవుననే చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లాపై టీడీపీకి మంచి పట్టు ఉంది. ఏ ఎన్నికలైన ఇక్కడ టీడీపీ సత్తా చాటేది. అయితే 2019 ఎన్నికల తర్వాత నుంచే జిల్లాలో టీడీపీకి కష్టాలు మొదలయ్యాయి. ఆ ఎన్నికల్లో వైసీపీ 14 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకుంటే, టీడీపీ 2 అసెంబ్లీ, ఒక ఎంపీ సీటు గెలుచుకుంది. కృష్ణా జిల్లాలో టీడీపీ ఇంత ఘోరంగా ఓడిపోవడం ఇదే తొలిసారి. అయితే ఓడిపోయాక పార్టీ ఏమన్నా బలం పుంజుకుందా అంటే అది లేదు. పైగా గెలిచిన రెండు స్థానాల్లో టీడీపీ పట్టు కోల్పోతుంది. విజయవాడ తూర్పు, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఆ రెండు స్థానాలు సైతం ఇప్పుడు వైసీపీ వశమైపోతున్నాయి.

ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీని వీడి వైసీపీ వైపుకు వచ్చిన విషయం తెలిసిందే. వ్యక్తిగతంగా బలమైన ఇమేజ్ ఉన్న వంశీ టీడీపీని వీడటం పెద్ద మైనస్ అయింది. వంశీ వెళ్లిపోవడం వల్ల కంచుకోట లాంటి గన్నవరంలో టీడీపీ జెండానే కనిపించడం లేదు. ఇక్కడ టీడీపీ తరుపున బచ్చుల అర్జునుడు పనిచేస్తున్నా సరే పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నారు. వంశీ దెబ్బకు టీడీపీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. భవిష్యత్‌లో కూడా గన్నవరంలో టీడీపీ పుంజుకోవడం కష్టమే అనిపిస్తుంది. అస‌లు ఆ పార్టీకి స‌రైన నాయ‌కుడే ఇక్క‌డ దొరికే ప‌రిస్థితి లేదు.

అటు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో సైతం టీడీపీకి కష్టకాలం మొదలైంది. ఇక్క ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నా సరే, దేవినేని అవినాష్ టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్లడంతో తూర్పులో రాజకీయాలు మారిపోయాయి. అవినాష్ తూర్పు ఇన్‌చార్జ్‌గా దూసుకెళుతున్నారు. ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువగానే ప్రజలకు సేవ చేస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలని పరిష్కరిస్తూ, సొంత డబ్బులని సైతం ఖర్చు పెట్టి ప్రజలకు అండగా ఉంటున్నారు.

పైగా అవినాష్‌కు జ‌గ‌న్ అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్నాయి. అందుకే ఇటీవ‌ల కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీ స‌త్తా చాటింది. అవినాష్ ప్ర‌తి రోజూ ఏదో ఒక ప్రోగ్రామ్‌తో ప్ర‌జ‌ల్లో ఉంటుంటే టీడీపీ ఎమ్మెల్యే గ‌ద్దె పార్టీ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌డంతో బేజారుగా ఉంటున్నారు. ఇక టీడీపీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత‌లు కూడా వైసీపీ చెంత చేరిపోతున్నారు. ఈ ప‌రిణామాల‌తో నియోజకవర్గంలో అవినాష్‌కు అనుకూలంగా రాజకీయాలు మారాయి. ఏదేమైనా టీడీపీకి మిగిలిన రెండు సీట్ల‌లోనూ గ‌త ఎన్నిక‌ల్లో ఆ పార్టీలో ఉన్న నేత‌లే ఇప్పుడు ఆ పార్టీకి చెక్ పెట్టేస్తున్నారు.