దండయాత్ర.. ఇది అమేజాన్ ప్రైమ్ దండయాత్ర

లాక్ డౌన్ నడుస్తుండటంతో రెండు నెలలుగా థియేటర్లు మూత పడి ఉన్నాయి. ఇంకో నాలుగైదు నెలల పాటు థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త సినిమాల్ని నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేయడానికి జోరుగా సంప్రదింపులు జరుగుతున్నాయి. తెలుగులో వి, రెడ్ లాంటి పేరున్న సినిమాల్ని ఓటీటీల్లోకి తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలే జరిగాయి కానీ అవి ఫలితాన్నివ్వలేదు.

ఐతే ‘అమృతారామ్’ అనే ఓ చిన్న సినిమాను గత నెల ధైర్యం చేసి నేరుగా జీ5లో రిలీజ్ చేశారు. కానీ ఆ సినిమాలో విషయం లేకపోవడంతో జనాలు పట్టించుకోలేదు. దీంతో ఓటీటీల్లో సినిమాల్ని రిలీజ్ చేసే విషయంలో కాస్త ముందు వెనుక ఆలోచించారు. మరోవైపు తమిళంలో జ్యోతిక సినిమా ‘పొన్ మగల్ వందాల్’ చిత్రాన్ని అమేజాన్ ప్రైంలో రిలీజ్ చేయబోతే.. అక్కడి నిర్మాతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో ఓటీటీల్లో కొత్త సినిమాల రిలీజ్ విషయంలో వెనకడుగు పడ్డట్లే కనిపించింది. కానీ నిన్న అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానాల ‘గులాబో సితాబో’ను జూన్ 12న అమేజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడం ఆలస్యం.. ఒక అలజడి మొదలైంది. అంత పెద్ద సినిమా రూపకర్తలే ప్రైమ్ ఆఫర్లకు తలొగ్గితే మిగతా సినిమాలు టెంప్ట్ అవ్వకుండా ఎలా ఉంటాయి. దీంతో పాటే వివిధ భాషల్లో అరడజను సినిమాల్ని డైరెక్టు‌గా తమ ఫ్లాట్ ఫామ్ మీద రిలీజ్ చేయడానికి అమేజాన్ డీల్స్ కుదుర్చుకుంది.

అందులో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు, తమిళ చిత్రం ‘పెంగ్విన్’ కూడా ఉండటం విశేషం. ఈ చిత్రం జూన్ 12న రిలీజ్ కాబోతున్నట్లు ప్రైమ్ ప్రకటించింది. అలాగే జ్యోతిక సినిమా ‘పొన్ మగల్ వందాల్’ రిలీజ్ డేడ్‌ను కూడా అమేజాన్ కన్ఫమ్ చేసింది. ఈ చిత్రం మే 29న రిలీజ్ కానుంది.

కన్నడ సినిమా ‘లా’, ‘ఫ్రెంచ్ బిరియాని’ జూన్లోనే రిలీజ్ కానుండగా.. మలయాళంలో అదితిరావు నటించిన ‘సుఫియుం సుజాతయుం’, హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషించిన ‘శకుంతలా దేవి’ చిత్రాల రిలీజ్ డేట్లు ఖరారు కాలేదు కానీ.. అవి కూడా ప్రైంలో డైరెక్ట్‌గా రిలీజ్ కానున్నట్లు అయితే ప్రకటించేశారు. మొత్తానికి థియేట్రికల్ రిలీజ్ లేకుండా సినిమాల్ని నేరుగా తమ ఫ్లాట్ ఫాంలో రిలీజ్ చేసే దిశగా అమేజాన్ ప్రైమ్ పెద్ద ముందడుగే వేసిందని చెప్పాలి.