రూమర్లను ఖండించిన ‘ఉప్పెన’ హీరోయిన్


కృతి శెట్టి.. గత ఏడాది కాలంలో తెలుగులో ఈ అమ్మాయి గురించి జరిగినంత చర్చ పెద్ద పెద్ద స్టార్ హీరోయిన్ల గురించి కూడా జరగలేదంటే అతిశయోక్తి కాదు. ‘ఉప్పెన’ సినిమాతో కథానాయికగా పరిచయం అయిన కృతి పేరు.. ఈ సినిమా విడుదల కాకముందే జనాల నోళ్లలో బాగా నానింది. ఈ సినిమా ప్రోమోల్లో ఆమె లుక్స్.. తన హావభావాలు అందరినీ ఆకట్టుకున్నాయి. విడుదలకు ముందే ఈ సినిమాకు హైప్ రావడంలో కృతి పాత్ర కూడా కీలకమే. అందుకే ‘ఉప్పెన’ ప్రేక్షకులను పలకరించడానికి ముందే ఆమెకు వేరే చిత్రాల్లో అవకాశాలు మొదలైపోయాయి.

నాని చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’తో పాటు సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహనకృష్ణల ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమాలోనూ కృతి కథానాయికగా ఎంపికవడం తెలిసిందే. ఇక రిలీజ్ తర్వాత ఆమె పేరు మరింతగా మార్మోగింది. కృతి డిమాండ్ మరింతగా పెరిగింది. రామ్ కొత్త చిత్రానికి కూడా కృతిని కథానాయికగా ఎంచుకున్నారు.

ఐతే ఇవి కాక వేరే ప్రాజెక్టుల్లోనూ కృతి హీరోయిన్ అంటూ కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. తమిళ స్టార్ సూర్య సినిమాలోనూ కృతికి ఛాన్స్ వచ్చిందన్నారు. ఐతే తన గురించి ఇలాంటి ప్రచారాలు మీడియాలో జోరుగా సాగిపోతుండటంతో కృతి ట్విట్టర్లో స్పందించింది.

‘‘నా కొత్త సినిమాల గురించి మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం నేను మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తున్నారు. నాని, సుధీర్ బాబు, రామ్‌లకు జోడీగా నటిస్తున్నా. ప్రస్తుతానికి నా దృష్టి పూర్తిగా ఈ మూడు చిత్రాల మీదే ఉంది. నేను కొత్త సినిమాలు ఒప్పుకుంటే కచ్చితంగా వాటి నుంచి నేనే వెల్లడిస్తా. ఈ కష్ట కాలంలో అందరూ సురక్షితంగా ఉండండి. మీ కుటుంబాలను జాగ్రత్తగా చూసుకోండి’’ అంటూ ట్వీట్ చేసింది కృతి. ఇప్పుడు చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేయడానికి కృతికి ఏడాది దాకా సమయం పడుతుంది. అవయ్యాకే కొత్త సినిమాలకు సంతకం చేసేలా ఉంది ‘ఉప్పెన’ భామ.