నేడే విడుదల

కోవిడ్ వైరస్ నియంత్రణకు డీఆర్డీవో శ్రమించి డెవలప్ చేసిన 2 డీజీ మందు సోమవారమే విడుదలవుతోంది. కేంద్రమంత్రులు రాజ్ నాధ్ సింగ్, హర్షవర్ధన్ ఢిల్లీలో 2 డీజీ ఔషధాన్ని విడుదల చేస్తున్నారు. కేంద్రమంత్రులు రిలీజ్ చేయగానే సోమవారం 10 వేల పాకెట్లు (సాచెట్లు) మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే ఈనెల 27, 28 తేదీల నుండి మరిన్ని సాచెట్లను ప్రతిరోజు మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు డీఆర్డీవో ప్లాన్ చేస్తోంది.

నిజానికి ఈ మందును గతంలో క్యాన్సర్ చికిత్స కోసం అభివృద్ధి చేశారు. అదే ఫార్ములాతో ఇపుడు కరోనా వైరస్ ను నియంత్రించేందుకు ఉపయోగించవచ్చనే ఉద్దేశ్యంతో డెవలప్ చేశారు. శాస్త్రజ్ఞుల పరిశోధనలో మంచి ఫలితాలు వచ్చినట్లు డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి చెప్పారు. జూన్ నుండి పూర్తిస్ధాయిలో సాచెట్లను మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్లు స్పష్టం చేశారు.

అంటే జూన్ నెలనుండి ఒకవైపు కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలతో పాటు మరోవైపు 2 డీజీ సాచెట్లు కూడా జనాలకు అందుబాటులో రాబోతున్నాయనే అనుకోవాలి. ఒక్కసారిగా టీకాలు, సాచెట్లు అందుబాటులోకి రాబోతున్న కారణంగా కరోనా వైరస్ ను జయించటం జనాలకు పెద్ద కష్టం కాబోదనే అనిపిస్తోంది. ఇదే సమయంలో టీకాలు, సాచెట్ల విషయంలో ప్రభుత్వాలపైన ఒత్తిడి తగ్గటం మంచి పరిణామమే.

దేశంమొత్తం కోవిడ్ పై పోరాడే ఔషధం కోసం ఎదురుచూస్తున్న సమయంలో తాము డెవలప్ చేసిన 2 డీజీ మార్కెట్లోకి రావటం సంతోషంగా ఉందన్నారు సతీష్. తాము నిర్వహించిన 2డీజీ క్లినికల్ ట్రయల్స్ లో ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని నమ్మకంగా చెప్పారు. మొత్తంమీద కరోనాపై యుద్ధం చేసేందుకు ఎన్ని ఆయుధాలు సమకూరితే జనాలకు అంత మంచిదే కదా.