డోసుల మధ్య గ్యాప్ ఎందుకు పెంచుతున్నారో తెలుసా ?

టీకాలు మార్కెట్లోకి వచ్చిన కొత్తలో మొదటిడోసు వేసుకున్న వారికి 30 రోజులు కాగానే రెండో డోసు వేసేశారు. అంటే అప్పట్లో వ్యాక్సినేషన్ విషయంలో జనాలు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎప్పుడైతే టీకాలు వేసుకునే వయసును 45 ఏళ్ళకు తగ్గించటం, కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత మొదలవ్వటంతో జనాలకు టీకాలపై దృష్టిమళ్ళింది. దాంతో వ్యాక్సినేషన్ కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. డిమాండ్ ఎప్పుడైతే పెరిగిపోయిందో ఉత్పత్తిలేకపోవటంతో టీకాల కొరత పెరిగిపోయింది.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే దేశంలో కోవీషీల్డ్, కోవ్యాగ్జిన్ టీకాలను ఉత్పత్తిచేస్తున్నవి రెండే కంపెనీలు. ఈ రెండింటికీ డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి చేసే సామర్ధంలేదన్నది వాస్తవం. మన రాష్ట్రం లెక్క తీసుకుంటే సుమారు 7 కోట్ల డోసులు కావాలి. రెండు కంపెనీలకు కలిపి నెలకు ఉత్పత్తి సామర్ధ్యం సుమారు 8 కోట్ల డోసులు మాత్రమే. ఈ 8 కోట్ల డోసులనే దేశంలోని అన్నీ రాష్ట్రాలకు పంచాలి.

అంటే మన రాష్ట్ర అవసరాలు తీరాలంటేనే ఎన్ని నెలలు పడుతుందో తెలీదు. దాదాపు ఇదే పరిస్దితి అన్నీ రాష్ట్రాల్లోను కనబడుతోంది. డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి పెంచలేకపోతోంది కాబట్టే టీకాలు వేయించుకునే రెండు డోసుల మధ్య గ్యాప్ ను కేంద్రప్రభుత్వం పెంచేస్తోంది. కోవీషీల్డ్ టీకా విషయంలో మాత్రం రెండు డోసుల మధ్య గ్యాప్ మొదటేమో 28 రోజులన్నారు. తర్వాత ఆరువారాలన్నారు. ఆ తర్వాతేమో 6-8 వారాలన్నారు. ఈమధ్యనే గ్యాప్ ను 8 వారాల నుండి 12 వారాలకు పెంచిన కేంద్రం తాజాగా 12-16 వారాలకు గ్యాప్ పెంచేసింది.

కేవలం వ్యాక్సిన్ల ఉత్పత్తి సాధ్యం కావటంలేదు కాబట్టే గ్యాప్ ను పెంచేస్తోందని అర్ధమైపోతోంది. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకుని టీకాల ఉత్పత్తి విషయంలో ఫార్ములాను సామర్ధ్యాన్ని అన్నీ కంపెనీలతోను పంచుకునుంటే ఇపుడీ కొరత వచ్చుండేది కాదు. కనీసం విదేశీకంపెనీలను దేశంలోకి అనుమతించి ఉన్నా ఇన్ని సమస్యలుండేవి కావు. ఫార్ములను షేర్ చేసుకోక, విదేశీకంపెనీలను అనుమతించకపోవటంతో టీకాల కొరత దేశాన్ని పట్టి పీడిస్తోంది.