ఆక్సిజన్ కావాలా.. బస్సెక్కండి

మనసుంటే మార్గం ఉంటుంది అనడానికి ఇది ఉదాహరణ. అత్యవసర స్థితిలో కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించడం కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన ఏర్పాటు అందరినీ ఆకట్టుకుంటోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వాలకు స్ఫూర్తినిస్తోంది. కొవిడ్ రోగులకు ఆక్సిజన్ అందించడం కోసం బస్సులో ఆక్సిజన్ వ్యవస్థను ఏర్పాటు చేయడం విశేషం.

ప్రస్తుత కొవిడ్ కల్లోల పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కరోనా బాధితులకు అత్యవసర స్థితిలో ఆక్సిజన్ అందక ఎలా అల్లాడుతున్నారో తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి రూయా ఆసుపత్రిలో 12 మంది దాకా ఆక్సిజన్ అందక చనిపోయారు. కొన్ని చోట్ల ఆక్సిజన్ అందజేసే ఏర్పాటు ఉన్నా.. సరిపడా ఆక్సిజన్ నిల్వలు లేవు. ఆక్సిజన్ సిలిండర్లున్న చోట వాటి ద్వారా రోగులకు అమర్చే వ్యవస్థ ఉండట్లేదు. అత్యవసర స్థితిలో ఆక్సిజన్ పెట్టుకోవడానికి బాధితులు ఎక్కడెక్కడికో వెళ్లాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఆక్సిజన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. మొబైల్ ఆక్సిజన్ వాహనం పేరుతో వీటిని నడుపుతోంది. ఒక్కో బస్సులో ఎనిమిది ఆక్సిజన్ సిలిండర్లు, వాటి ద్వారా రోగులకు శ్వాస అందించే వ్యవస్థను ఏర్పాటు చేశారు. కొన్ని సీట్లను తొలగించి రోగుల మధ్య దూరం ఉండేలా, సీట్లలో కూర్చుని లేదా పడుకుని ఆక్సిజన్ పెట్టించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇలా 20 బస్సులను మొబైల్ ఆక్సిజన్ వాహనాలుగా మార్చడం విశేషం. బెంగళూరులోని ప్రభుత్వ ఆసుపత్రులు, కొవిడ్ చికిత్స కేంద్రాల సమీపంలో వీటిని నిలుపుతున్నారు. అత్యవసర స్థితిలో ఆసుపత్రులకు వచ్చేవాళ్లు వెంటనే ఈ బస్సుల్లోకి ఎక్కి శ్వాస తీసుకోవచ్చు. వీటి ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడిన వాళ్లు అవుతారనడంలో సందేహం లేదు. ఇలాంటి కష్ట కాలంలో ఇలా అత్యవసరంగా, వినూత్నంగా ఆలోచించి ఈ ఏర్పాటు చేసిన కర్ణాటక ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో అందరూ కొనియాడుతున్నారు.