కోహ్లి ఏడు కోట్లు కోరుకుంటే..

కరోనా మహమ్మారి దేశంలో కరాళ నృత్యం చేస్తోంది. సెకండ్ వేవ్ లక్షల మందిని వైరస్ బాధితులుగా మారుస్తోంది. రోజూ వేలమంది చనిపోతున్నారు. ఈ సమయంలో బాధితులను ఆదుకోవడానికి, అలాగే నిర్విరామంగా సేవలందిస్తున్న హెల్త్ వర్కర్లకు సాయం చేయడానికి సెలబ్రెటీలెందరో ముందుకు వస్తున్నారు. విరాళాలు ప్రకటిస్తున్నారు. జనాల నుంచి కూడా విరాళాలు స్వీకరిస్తున్నారు.

దేశంలో పరిస్థితులు చూసి చలించిపోయిన టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బాలీవుడ్ నటి అయిన అతడి సతీమణి అనుష్క శర్మ కలిసి ఒక ఇనిషియేటివ్ మొదలుపెట్టారు. స్వయంగా రూ.2 కోట్ల విరాళం ప్రకటించి.. కీటో సంస్థతో కలిసి నిధుల సేకరణకు నడుం బిగించారు. రూ.7 కోట్ల విరాళాలు సేకరించాలన్నది వీరి ప్రణాళిక. ఈ మంచి పనికి జనాల నుంచి మంచి స్పందనే వచ్చింది. 24 గంటల్లో విరాళాల మొత్తం రూ.3.6 కోట్లకు చేరుకుంది.

ఒక్క రోజులో సగం టార్గెట్ అందుకున్నామని, రూ. 7 కోట్ల టార్గెట్‌ను కూడా అందుకుంటామని మొన్న కోహ్లి ట్వీట్ చేశాడు. ఐతే రెండు రోజులు తిరిగేసరికి టార్గెట్ మొత్తాన్ని దాటిపోయి విరాళాల మొత్తం రూ.11 కోట్లకు చేరిపోవడం విశేషం. సామాన్య జనం రూ.4 కోట్ల దాకా విరాళాలు అందజేయగా.. కోహ్లి, అనుష్క అందించిన మొత్తంతో కలిపి రూ.6 కోట్ల మార్కును టచ్ చేసింది ఫండ్.

ఐతే ఎంపీఎల్ స్పోర్ట్స్ అనే సంస్థ విరుష్క జోడీ చేస్తున్న మంచి పనికి తోడ్పాటు అందించాలని భావించింది. వాళ్లు ఏకంగా రూ.5 కోట్ల భారీ విరాళం ప్రకటించారు. దీంతో విరుష్కల సహాయ నిధి మొత్తం రూ.11 కోట్లకు వెళ్లిపోయింది. ఎంపీఎల్ సంస్థకు కృతజ్ఞతలు చెప్పిన కోహ్లి.. రూ.11 కోట్ల మొత్తాన్ని కీటో సంస్థతో కలిసి కొవిడ్ సహాయ చర్యలకు ఉపయోగించనున్నట్లు వెల్లడించాడు. విరుష్క జోడీని చూసి మరింతమంది సెలబ్రెటీలు స్ఫూర్తి పొందుతారని భావిస్తున్నారు.