సల్మాన్ ఖాన్ ఇంటర్నేషనల్ దందా


దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతున్న సమయంలో ఓ భారీ చిత్రం విడుదలకు సిద్ధం కావడం విశేషమే. సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం ‘రాధె’ను రంజాన్ కానుకగా ఈ నెల 13న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించడం.. దానికి కట్టుబడి సినిమాను విడుదలకు సిద్ధం చేస్తుండటం తెలిసిందే. ఒకేసారి థియేటర్లతో పాటు ‘జీ’ ఓటీటీ, కొన్ని డీటీహెచ్‌ల ద్వారా ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో పాక్షికంగానో, పూర్తి స్థాయిలోనో లాక్ డౌన్ అమలవుతోంది. దాదాపుగా అన్ని చోట్లా థియేటర్లు మూతపడే ఉన్నాయి. ఎక్కడా అవి తెరిచి ఉంచే పరిస్థితి కనిపించడం లేదు. అలాంటపుడు ‘రాధె’ సినిమాకు థియేట్రికల్ రిలీజ్ ఏంటి అనే సందేహం కలగడం ఖాయం.

ఈ సినిమాను మే 13న విడుదల చేయనున్నట్లు ప్రకటన చేసినప్పటికి, ఇప్పటికి పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. తాజాగా తెలంగాణలో లాక్‌డౌన్‌లో భాగంగా థియేటర్లను పూర్తిగా మూసి వేస్తున్న సంగతి తెలిసిందే.

ఐతే ఇండియా వరకు చూసుకుంటే ‘రాధె’ సినిమా పేరుకే థియేటర్లలో రిలీజవుతోంది. దాదాపుగా ఎక్కడా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఉండకపోవచ్చు. భారతీయ ప్రేక్షకులు ఈ సినిమాను ‘జీ’లో లేదా డీటీహెచ్‌ల ద్వారా పే పర్ వ్యూ పద్ధతిలో చూసుకోవాల్సిందే. మరి దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడ్డపుడు థియేట్రికల్ రిలీజ్ ఎందుకు అనే సందేహం రావచ్చు. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ల మీద ఫోకస్‌తోనే. మన దగ్గర ఉన్నంతగా కరోనా తీవ్రత ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేదు. యుఎస్, యూకే, గల్ఫ్ కంట్రీస్ సహా భారతీయ చిత్రాలకు మంచి మార్కెట్లు ఉన్న దేశాల్లో థియేటర్లు బాగానే నడుస్తున్నాయి. చాన్నాళ్లుగా సరైన హిందీ సినిమా ఏదీ అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ కాలేదు. అందరూ తమ చిత్రాలను వాయిదా వేసుకున్నారు.

ఇలాంటి టైంలో సల్మాన్ సినిమాను అంతర్జాతీయ మార్కెట్లలో రికార్డు స్థాయిలో రిలీజ్ చేసుకుని భారీగా ఆదాయం అందుకోవడానికి అవకాశం లభించింది. అందుకే చిత్ర బృందం తెలివిగా ఆలోచించి థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయింది. విదేశీ మార్కెట్ల ద్వారా ఈ చిత్ర వసూళ్లు వంద కోట్లు తగ్గవని.. ఇండియాలో పే పర్ వ్యూ పద్ధతిలో కోటి మంది ఈ సినిమా చూసినా వసూళ్లు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు.