ఏపీ బీజేపీకి బాబే సీఎం.. టీడీపీనే అధికార పార్టీ..!

రాష్ట్ర బీజేపీలో ఒక విధానం అంటూ లేద‌నే కామెంట్లు త‌ర‌చుగా వినిపిస్తుంటాయి. ముఖ్యంగా సోము వీర్రాజు పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. పార్టీ ప‌రిస్థితి మ‌రింత అధ్వానంగా మారిపోయింది. ఆయ‌న ఎవ‌రిని టార్గెట్ చేస్తారో.. ఎలాంటి రాజ‌కీయాలు చేస్తారో.. ఎవ‌రిని తొక్కేస్తారో.. ఎవ‌రికి అవ‌కాశం ఇస్తారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో ఏపీలో బీజేపీ తీవ్రంగా న‌ష్ట‌పోతోంద‌ని ఆ పార్టీ నేత‌లే వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ.. అధికార ప‌క్షాన్ని టార్గెట్ చేస్తుంది. అధికార పార్టీలో ఉన్న నేత‌ల ఆగ‌డాలు, అక్ర‌మాల‌ను ల‌క్ష్యంగా చేసుకుని.. విమ‌ర్శ‌లు గుప్పిస్తుంది.

ఇదే స‌హ‌జంగా ఏ పార్టీ అయినా.. ఏరాష్ట్రంలో అయినా చేసే ప‌ని. ఈ ప‌ద్ధతి కొన్నాళ్లు ఏపీ బీజేపీలోనూ సాగింది. ఒక్క సీటు కూడా గెల‌వ‌క‌పోయినా.. అధికారంలో ఉన్న వైసీపీని నిత్యం విమ‌ర్శ‌ల‌తో ముంచెత్తారు.. గ‌త అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌. ఇసుక అక్ర‌మాలు, మ‌ద్యం విధానం.. ఇలా అనేక విష‌యాల‌ను ఆయ‌న టార్గెట్ చేసుకుని వైసీపీ నేత‌ల‌కు కంటిపై కునుకులేకుండా చేశారు. అయితే.. త‌ర్వాత పార్టీ ప‌గ్గాలు చేప‌ట్టిన సోము వీర్రాజు మాత్రం.. దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం మొద‌లు పెట్టారు. వైసీపీని పొగ‌డ‌క‌పోయినా.. ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీని మాత్ర‌మే తిట్టిపోయ‌డంగా ముందుకు సాగారు.

ఈ విష‌యం పార్టీలోను, ప్ర‌జ‌ల్లోనూ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో బీజేపీ.. నేత‌లు వైసీపీకి బీ-టీంగా మారిపోయార‌నే కామెంట్లు కూడా వినిపించాయి. మ‌రికొంద‌రు కేంద్రంలోని పెద్ద‌లు ఇదే విష‌యం చెప్పి ఉంటార‌ని అందుకే అలా చేస్తున్నార‌ని అన్నారు. ఇదే నిజం అనుకున్నా.. తిరుప‌తి ఉప ఎన్నిక వ‌చ్చే స‌రికి కేంద్రంలోని పెద్ద‌లు కూడా యూట‌ర్న్ తీసుకుని.. రాష్ట్రంలో జ‌గ‌న్ పాల‌న‌పై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు. కానీ, సోము ఆయ‌న ప‌రివారం మాత్రం వైసీపీని ఒక్క‌మాట కూడా అన‌లేదు. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ టీడీపీని టార్గెట్ చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పించారు.

చంద్ర‌బాబు చేసింది ఏమీలేద‌న్నారు. తిరుప‌తి అభివృద్దికి తామే నిధులు ఇచ్చామ‌ని చెప్పారు. అంటే.. చంద్ర‌బాబే సీఎం అని.. టీడీపీనే అధికారంలో ఉంద‌నే భావ‌న‌తో తీవ్రంగా దుయ్య‌బట్టారు. అంతేత‌ప్ప‌.. వైసీపీ పాల‌న‌పై నామ‌మాత్రంగా అది కూడా ప్ర‌ధాన మీడియా కంట ప‌డ‌కుండా తూతూ మంత్రంగా విమ‌ర్శ‌లు చేశారు. ఫ‌లితంగా ఇక్క‌డ డిపాజిట్లు కూడా ద‌క్కించుకోలేక పోయారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఇదే ప‌రిస్థితిని కొన‌సాగిస్తారా? లేక పంథాను మార్చుకుంటారా? అనేది ఆస‌క్తిగా మారింది. పంథా మార్చుకోక పోతే.. పూర్తిగా తుడిచి పెట్టుకుని పోవ‌డం ఖాయం అంటున్నారు ప‌రిశీల‌కులు.