మోడీ చెప్పలేదు కానీ.. పది రాష్ట్రాలు మినహా

భారత్‌లో కరోనా తీవ్రత దృష్ట్యా మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిందే అని నిపుణులు కుండబద్దలు కొడుతున్నారు. అన్ని వైపుల నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఈ దిశగా సూచనలు అందుతున్నాయి. ఐతే గత ఏడాది లాక్ డౌన్ దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తినడం.. ప్రజలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడటంతో మళ్లీ ఇప్పుడు మరోసారి దేశవ్యాప్త లాక్ డౌన్ విధించే పరిస్థితుల్లో కేంద్రం లేదు. కరోనా విలయం పతాక స్థాయికి చేరుతున్నా సరే.. మోడీ సర్కారు చలించట్లేదు. లాక్ డౌన్‌పై నిర్ణయాన్ని రాష్ట్రాలకు విడిచి పెట్టేసింది.

ఐతే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేయకపోయినా.. దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలవుతుండటం గమనార్హం. గత కొన్ని వారాల్లో రాష్ట్రాలు ఒక్కొక్కటిగా లాక్ డౌన్ దిశగా అడుగులు వేశాయి. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ అమలు చేయని రాష్ట్రాలు కేవలం పది మాత్రమే. అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉండటం విశేషం. ఐతే ఈ రెండు రాష్ట్రాల్లో పాక్షిక లాక్ డౌన్ నడుస్తోంది. ఏపీలో ఉదయం 6 నుంచి 12 వరకు మాత్రమే వ్యాపారాలు నడుస్తున్నాయి. మిగతా సమయంలో కర్ఫ్యూ పెడుతున్నారు. అంటే ఆరు గంటలు మినహా లాక్ డౌన్ నడుస్తోందన్నమాట. తెలంగాణలో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ నడుస్తోంది. దక్షిణాదిన ఏపీ, తెలంగాణలను మినహాయిస్తే మిగతా రాష్ట్రాలన్నింట్లోనూ లాక్ డౌన్ పెట్టేశారు.

ఉత్తరాది విషయానికి వస్తే మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో పాటు ఉత్తరాఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ల్లో మాత్రమే పూర్తి లాక్ డౌన్ లేదు. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్‌ల్లోనూ పాక్షిక లాక్ డౌన్ పెట్టారు. ఇక జమ్ము-కాశ్మీర్-లద్దాక్‌ల్లోనూ పాక్షిక లాక్ డౌన్ నడుస్తోంది. వీటిని మినహాయిస్తే దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింట్లో పూర్తి స్థాయి లాక్ డౌన్ నడుస్తోంది. దేశం మొత్తంలో పాక్షికంగానో, పూర్తి స్థాయిలోనో ప్రతి చోటా లాక్ డౌన్ నడుస్తుండటం గమనార్హం. ఐతే ఇలా కాకుండా పూర్తి స్థాయిలో ఒకట్రెండు వారాలైనా లాక్ డౌన్ పెట్టకుంటే కరోనా అదుపులోకి రాదన్నది నిపుణుల మాట.