మంచి నటుడు కరోనాకు బలయ్యాడు


పాండు అని తమిళ నటుడు. ఆయన పేరు పాండు అని మన వాళ్లకు తెలియకపోవచ్చు కానీ.. ఎన్నో డబ్బింగ్ సినిమాల ద్వారా మన వాళ్లకు ఆ నటుడు బాగానే తెలుసు. వేణు హీరోగా నటించిన ‘చెప్పవే చిరుగాలి’ సినిమాలో సునీల్‌తో కలిసి పాండు చేసిన కామెడీ కడుపుబ్బ నవ్వించేదే. అందులో సునీల్ నాటు వైద్యం చేసే డాక్టర్ పాత్రలో కనిపించగా.. ఎప్పట్నుంచో తనకు ఆస్తి దక్కకుండా చేస్తున్న తన తాత, అతడి వైద్యం వల్ల చనిపోయాడంటూ తనకు సన్మానం చేయడానికి ఊరేగింపుగా వచ్చే పాత్రలో పాండు చేసిన కామెడీని అంత సులువుగా మరిచిపోలేం.

తమిళంలో వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఈ నటుడు.. గురువారం కరోనాకు బలయ్యాడు. కొన్ని రోజులుగా కరోనాతో పోరాడుతున్న పాండు.. ఇంటి నుంచే వైద్యం పొందాడు. తర్వాత పరిస్థితి విషమించి ఆసుపత్రిలో చేరాడు. చివరికి వైరస్‌తో పోరాడి ఓడిపోయిన పాండు గురువారం తుది శ్వాస విడిచాడు. పాండు వయసు 74 సంవత్సరాలు. 90ల్లో గౌండ్రమణి, సెంథిల్ ఆధిపత్యం సాగుతున్న సమయంలో పాండు కమెడియన్‌గా అరంగేట్రం చేశాడు. టిపికల్ కామెడీ టైమింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకుని అవకాశాలు అందుకున్నాడు.

దాదాపు నాలుగు దశాబ్దాలుగా అతను నటుడిగా కొనసాగుతున్నాడు. ఎందరో పెద్ద హీరోలతో సినిమాలు చేశాడు. ఇప్పుడు కూడా అతను నటుడిగా యాక్టివ్‌గానే ఉన్నాడు. రాజకీయాల్లోనూ ఆయనకు ప్రవేశం ఉంది. ఎంజీఆర్ పెట్టిన అన్నాడీఎంకే పార్టీ గుర్తును డిజైన్ చేసింది పాండునే కావడం విశేషం. ఆర్టిస్ట్ కూడా అయిన పాండు.. స్వయంగా చేత్తో ఆ రెండాకుల గుర్తును గీశాడు. ఎంజీఆర్‌‌తో పాండుకు మంచి సాన్నిహిత్యం ఉండేది. ఆయన కోరిక మేరకు పార్టీ గుర్తును డిజైన్ చేశాడు పాండు.