మళ్లీ ఫ్యాక్షనిస్టుగా బాలయ్య?

టాలీవుడ్లో ఫ్యాక్షనిస్టు పాత్రలకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిన హీరోల్లో నందమూరి బాలకృష్ణ పేరు ముందు చెప్పుకోవాలి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలతో ఈ జానర్ సినిమాలకు తిరుగులేని స్థాయి తీసుకొచ్చిన ఘనత బాలయ్యదే. అప్పట్లో ఆ సినిమా ట్రెండ్ సెట్టర్లుగా నిలిచాయి. తర్వాత చాలామంది హీరోలు ఆ జానర్లో సినిమాలు చేయడంతో ఒక దశ దాటాక అది మొహం మొత్తేసింది.

బాలయ్య ఫ్యాక్షనిస్టు పాత్రలో కనిపించిన మరో చిత్రం ‘చెన్నకేశవరెడ్డి’ అనుకున్న స్థాయిలో ఆడకున్నా.. ఆ పాత్రలో బాలయ్య స్క్రీన్ ప్రెజెన్స్, నటన మాత్రం ప్రత్యేకంగా అనిపిస్తాయి. ‘పలనాటి బ్రహ్మనాయుడు’లో సైతం ఫ్యాక్షనిజం టచ్ ఉన్న పాత్రే చేశాడు బాలయ్య. కానీ అది డిజాస్టర్ అయింది. మళ్లీ ఆ జానర్ జోలికి వెళ్లలేదు. ఐతే చాలా గ్యాప్ తర్వాత బాలయ్య మరోసారి ఫ్యాక్షనిస్టుగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

‘క్రాక్’తో భారీ విజయాన్నందుకున్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది పల్నాడు నేపథ్యంలో నడిచే సినిమా అని.. ఫ్యాక్షనిజం ఛాయలు ఉంటాయని.. బాలయ్య రెండు మూడు షేడ్స్ ఉన్న పాత్ర చేయనున్నాడని.. సినిమాలో కొంతసేపు ఫ్యాక్షనిస్టుగా కనిపిస్తాడని అంటున్నారు. ఫ్యాక్షనిజం జానర్‌ సినిమాలు పూర్తిగా తగ్గిపోయిన నేపథ్యంలో మళ్లీ ఆ జానర్లోకి వెళ్లి వింటేజ్ బాలయ్యను చూపిద్దామని గోపీచంద్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ లాంటి అగ్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. బాలయ్య సరసన ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలు నటిస్తారని అంటున్నారు. ప్రి ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్న ఈ చిత్రాన్ని జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ప్రారంభిస్తారని అంటున్నారు. ప్రస్తుతం ఈ నందమూరి హీరో బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.