స‌బ్బంకు కాలం క‌లిసి రాలేదు… బ్యాడ్ ల‌క్ అంతే?

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో కీల‌క నేత శ‌కం ముగిసింది. విశాఖ జిల్లాకు చెందిన గ్రేట‌ర్ విశాఖ మేయ‌ర్‌, మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి తిరిగి రాని లోకాల‌కు వెళ్లిపోయారు. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో స‌బ్బం హ‌రిది విల‌క్ష‌ణ‌మైన శైలీ. ఉన్న‌ది ఉన్న‌ట్టు కుండ‌బ‌ద్ద‌లు కొట్టేస్తారు. కాంగ్రెస్‌లో రాజ‌కీయాలు ప్రారంభించిన ఆయ‌న.. ఆయ‌న ప‌డిన క‌ష్టానికి త‌గిన ఫ‌లితం అయితే పొంద‌లేక‌పోయారన్న‌ది నిజం. అతి సామాన్య‌మైన కుటుంబం నుంచి ఆయ‌న వ‌చ్చారు. భీమిలి నియోజ‌క‌వ‌ర్గంలో కొత్త‌వ‌ల‌స‌లో ఓ సాధార‌ణ కుటుంబంలో జ‌న్మించిన స‌బ్బం హ‌రికి గాంధీ కుటుంబం అంటే ఎంతో ఇష్టం. ఈ క్ర‌మంలోనే మూడున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌టే ఆయ‌న యువ‌జ‌న కాంగ్రెస్‌లోకి ఎంట్రీ ఇచ్చి విశాఖ రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషించారు.

అప్ప‌టికే అక్క‌డ విశాఖ రాజ‌కీయాల‌ను ద్రోణంరాజు స‌త్య‌నారాయ‌ణ లాంటి ఉద్దండులు శాసిస్తున్నారు. వారిని ఎదిరించి మ‌రీ స‌బ్బం హ‌రి యువ‌త‌ను త‌న వైపున‌కు తిప్పుకుని బ‌ల‌మైన నేత‌గా ఎదిగారు. 1999కు ముందు నుంచి దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌తో ఏర్ప‌డిన అనుబంధం క్ర‌మ‌క్ర‌మంగా బ‌ల‌ప‌డుతూ వ‌చ్చింది. దీంతో స‌బ్బం రాజ‌కీయంగా మంచి అవ‌కాశాలు అందుకున్నారు. 2009లో హ‌రి అన‌కాప‌ల్లి ఎంపీ అయ్యాడంటే వైఎస్ చ‌ల‌వే అని చెప్పాలి.

1994లో ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నంలో రాష్ట్రంలో కాంగ్రెస్ కొట్టుకుపోయింది. ఆ వెంట‌నే మూడు నెల‌ల‌కే జ‌రిగిన స్థానిక ఎన్నిక‌ల్లో విశాఖ మేయ‌ర్‌గా పోటీ చేసేందుకు ఎవ్వ‌రూ ముందుకు రాలేదు. ఆ టైంలో నేను పోటీకి రెడీ అంటూ స‌బ్బం విశాఖ మేయ‌ర్‌గా పోటీ చేసి గెలిచి వండ‌ర్ క్రియేట్ చేశారు. ఆ త‌ర్వాత ఆయ‌న రాజ‌కీయంగా మంచి ఛాన్సులు అందుకోలేక‌పోయారు. చివ‌ర‌కు 2009లో వైఎస్ వెన్నుత‌ట్టి ప్రోత్స‌హించి అన‌కాప‌ల్లి ఎంపీగా పోటీ చేశారు. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పత్రికాధిపతి నూకారపు సూర్యప్రకాశరావు ఉంటే ఇవతల ప్రజారాజ్యం నుంచి చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ పోటీలో ఉన్నారు. స‌బ్బం ఖ‌చ్చితంగా గెల‌వ‌రు అన్న అంచ‌నాలు తారు మారు చేసి గెలిచారు.

త‌ర్వాత వైఎస్‌. మ‌ర‌ణాంత‌రం కొద్ది రోజులు జ‌గ‌న్ వెంటే ఉన్నా.. త‌ర్వాత విబేధించి జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు చేశారు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. భీమిలిలో పోటీ చేసి ప్ర‌స్తుత మంత్రి అవంతి శ్రీనివాస్‌పై ఓడిపోయారు. ఆ ఎన్నిక‌ల్లో డ‌బ్బు పంచ‌క‌పోతే ఓడిపోతామ‌ని చెప్పినా ఆయ‌న ఎల్ల‌కాలం డ‌బ్బుల‌తో రాజ‌కీయం చేయ‌లేమ‌ని చెప్పి డ‌బ్బులు పంచ‌లేదు. అయినా గ‌ట్టిపోటీ ఇచ్చారు. రాజ‌కీయంగా చివ‌రి ద‌శ‌లో మాత్రం ఆయ‌న‌కు అనుకున్నంత గుర్తింపు రాలేదన్న బాధ అయితే ఆయ‌న‌లో ఉంద‌ని స‌న్నిహితులు అంటూ ఉంటారు.