చైతూదే తొలి అడుగు

Naga Chaitanya

డిజిటల్ మీడియంను ఒకప్పటిలా తక్కువ చూసే పరిస్థితి ఇప్పుడు లేదు. ముఖ్యంగా కరోనా పుణ్యమా అని ఓటీటీల హవా ఊహించని స్థాయికి చేరుకుని ఇండియాలో పెద్ద ఎత్తున వెబ్ సిరీస్‌లు, వెబ్ ఫిలింల నిర్మాణం జరుగుతోంది. దీంతో పెద్ద పెద్ద స్టార్లు అటు వైపు అడుగులు వేస్తున్నారు. సినిమాలే ఎక్కువ, వెబ్ సిరీస్‌లు తక్కువ అనే అభిప్రాయం తారల్లో మారిపోతోంది.

ఈ మధ్య కాలంలో చాలామంది ప్రముఖ సినిమా తారలు డిజిటల్ వైపు అడుగులు వేశారు. కాజల్, సమంత, తమన్నా లాంటి స్టార్ హీరోయిన్లు వెబ్ సిరీస్‌ల బాట పట్టారు. హీరోలు మాత్రమే ఇంకా కొంచెం బెట్టు చేస్తున్నారు. వాళ్లు సినిమాలతో తీరిక లేకుండా ఉండటం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఐతే హిందీలో అజయ్ దేవగణ్ లాంటి హీరోలు డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతుండటంతో సౌత్ హీరోల ఆలోచనలు కూడా మారుతున్నాయి.టాలీవుడ్లో స్టార్ అనే ఇగో లేకుండా ఏ పాత్ర చేయడానికైనా సిద్ధపడే యువ కథానాయకుడు నాగచైతన్య సైతం డిజిటల్ డెబ్యూకు రెడీ అవుతున్నాడన్నది తాజా సమాచారం. ఇప్పటికే అతడి భార్య ఓ వెబ్ సిరీస్ చేసింది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో కీలక పాత్ర పోషించింది. ఈపాటికే విడుదల కావాల్సిన ఆ సిరీస్ కొన్ని కారణాలతో ఆలస్యమవుతోంది.

అది రిలీజ్ కావడానికి ముందే చైతూ వెబ్ సిరీస్‌ను మొదలుపెట్టబోతున్నాడట. సామ్ డిజిటల్ డెబ్యూ జరగబోయే అమేజాన్ ప్రైమ్ వాళ్లతోనే చైతూకు కూడా ఒప్పందం కుదిరిందట. వారి నిర్మాణంలో అతనో వెబ్ సిరీస్‌లో నటించనున్నాడట. ఇది జాతీయ స్థాయిలో తెరకెక్కనున్న వెబ్ సిరీస్ అని.. రాధికా ఆప్టే, అతుల్ కులకర్ణి లాంటి బాలీవుడ్ తారలు ముఖ్య పాత్రలు పోషించనున్నారని.. వివిధ భాషల్లో ఈ సిరీస్‌ను రూపొందిస్తారని అంటున్నారు. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రానుందట. దర్శకుడెవరన్నది ఇంకా వెల్లడి కాలేదు. ‘థ్యాంక్ యు’ సినిమా తర్వాత చైతూ చేయబోయే ప్రాజెక్టు ఇదేనని సమాచారం. ఈ వార్త నిజమైతే టాలీవుడ్లో డిజిటల్ వైపు అడుగులేస్తున్న తొలి స్టార్ చైతూనే అవుతాడు.