తిరుప‌తిలో ఓడినా చంద్ర‌బాబు స‌క్సెస్ అయ్యారే ?

ఏపీలో తిరుప‌తి పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అంద‌రూ ఊహించిన ఫ‌లిత‌మే వ‌చ్చింది. వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ గురుమూర్తి 2.70 ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు. వైసీపీకి 6.20 ల‌క్ష‌ల ఓట్లు రాగా టీడీపీకి కూడా 3.53 ల‌క్ష‌ల వ‌ర‌కు ఓట్లు రావ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాలు సైతం షాక్ అయ్యాయి. టీడీపీ ఇంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఈ స్థాయిలో ఫైట్ ఇస్తుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోయారు. వైసీపీ నేతలు మున్సిపోల్స్‌, కార్పోరేష‌న్ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన వెంట‌నే తిరుప‌తిలో త‌మ‌కు ఏకంగా 3 లక్ష‌ల మెజార్టీ వ‌స్తుంద‌ని అంచనాలు పెట్టుకున్నారు. అయితే పోలింగ్ చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేస‌రికి త‌మ మెజార్టీ ఏకంగా 4 నుంచి 5 ల‌క్ష‌ల వ‌ర‌కు మెజార్టీ వ‌స్తుంద‌ని అతి ధీమా పోయారు.

ఇక చంద్ర‌బాబుకు తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోతామ‌ని ముందే తెలిసినా అంద‌రికంటే ముందుగానే అభ్య‌ర్థిని ప్ర‌క‌టించేశారు. గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన కేంద్ర మాజీ మంత్రి ప‌న‌బాక ల‌క్ష్మిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారు. ఇక లోకేష్‌, చంద్ర‌బాబు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ఈ ఉప ఎన్నిక కోసం పార్టీ రాష్ట్ర స్థాయి నాయ‌కులు 70 మందితో ఓ జంబో క‌మిటీ వేశారు. లోకేష్ సైతం రోజుల పాటు మ‌కాం వేశారు. అయితే ఇదంతా చేసింది గెలుద్దామ‌ని అయితే కాదు బీజేపీ ఏపీలో టీడీపీని తొక్కేసి వైసీపీకి తామే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్ర‌య‌త్నం చేసింది. తిరుప‌తి ఉప ఎన్నికకు ముందు ఏపీలో బీజేపీ వ‌ర్గాల నుంచి ఈ ప్ర‌చారం బాగా జ‌రిగింది.

అయితే చంద్ర‌బాబు ఇక్క‌డ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డ‌డంతో టీడీపీ ఓడిపోయినా గౌర‌వ‌ప్ర‌దంగా 3.5 ల‌క్ష‌ల ఓట్లు వ‌చ్చాయి. ఏపీలో వైసీపీకి ఎప్ప‌ట‌కి తామే ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధి అని.. బీజేపీకి ఇక్క‌డ అంత సీన్ లేద‌న్న విష‌యంపై అయితే అంద‌రికి క్లారిటీ ఇచ్చేశారు. ఈ క్ర‌మంలోనే పార్టీలో అంద‌రు నాయ‌కుల‌ను ఏకం చేసేందుకు కూడా చంద్ర‌బాబుకు ఈ ఉప ఎన్నిక బాగా ఉప‌యోగ‌ప‌డింది. ఇక ఈ ఉప ఎన్నిక‌తో బీజేపీ భ్ర‌మ‌లు కూడా చంద్ర‌బాబు తొల‌గించేశారు. తిరుప‌తిలో గెల‌వ‌క‌పోయినా రెండో ప్లేస్ మాదే అని ఎంతో ధీమాతో ఉన్న ఆ పార్టీ నేత‌ల‌కు డిపాజిట్ కూడా ద‌క్క‌క‌పోవ‌డంతో ప‌రువు ఘోరంగా పోయిన‌ట్ల‌య్యింది.

చంద్ర‌బాబు గెల‌వ‌క‌పోయినా ఏపీ రాజ‌కీయాల్లో జ‌న‌సేన‌, బీజేపీకి ఎంత మాత్రం సీన్ లేద‌న్న‌ది మాత్రం తేల్చేశారు. ఎప్ప‌ట‌కి అయినా ఆ రెండు పార్టీలు తనవైపు చూడక తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు. మ‌రి 2024 నాటికి ఈ ప‌రిణామాలు మూడు పార్టీల‌ను మ‌ళ్లీ 2014లోలా ఒక్క‌టి చేస్తాయా ? అన్న‌ది చూడాలి.