పేలుతున్న వర్మ ట్వీట్లు

రామ్ గోపాల్ వర్మను జనాలు సీరియస్‌గా తీసుకోవడం ఎప్పుడో మానేశారు కానీ.. ఆయన తన మార్కు సిల్లీ ట్వీట్లకు తోడు అప్పుడప్పుడూ కొన్ని పేలిపోయే ట్వీట్లు కూడా వేస్తుంటారు. రాజకీయాల్లో ఎక్కువగా బలహీనంగా ఉన్న పార్టీలనే టార్గెట్ చేయడం అలవాటైన వర్మ.. అప్పుడప్పుడూ మాత్రం ధైర్యం తెచ్చుకుని బలవంతులను లక్ష్యంగా చేసుకుంటూ ఉంటారు. వర్మ ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీని టార్గెట్ చేయడం విశేషమే.

దేశంలో కరోనాను అదుపు చేయడంలో మోడీ సర్కారు దారుణంగా విఫలం కావడం, ఇప్పుడు ప్రపంచం ముందు మోడీ దోషిగా నిలవడం తెలిసిందే. సెకండ్ వేవ్‌ను నియంత్రించడం, డిమాండ్‌కు తగ్గట్లు వ్యాక్సిన్లు సిద్ధం చేయించడం, వైద్య సౌకర్యాలు మెరుగుపరచడం.. ఇలా ఎందులో చూసినా మోడీ ప్రభుత్వం ఘోర వైఫల్యం కళ్లకు కడుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. దీనిపై వర్మ సమయోచితంగా స్పందించి.. మోడీకి ట్విట్టర్ ద్వారా గట్టి పంచ్‌లు వేస్తున్నాడు.,

సామూహికంగా కరోనా మృతదేహాల్ని ఖననం చేస్తున్న ఒక ఫొటో పెట్టిన వర్మ.. ఇలాంటి అందమైన హార్రర్ విజువల్స్ ఇచ్చినందుకు మోడీకి థ్యాంక్స్ అని.. రేప్పొద్దున ప్రధాని పదవి ఊడినా, ఇండియా వదిలేసి వెళ్లిపోయి ప్రపంచంలోనే అతి పెద్ద హార్రర్ ఫిలిం మేకర్‌గా బతికేయొచ్చని వర్మ ఎద్దేవా చేశాడు. తనకు హార్రర్ ఫిలిం మేకర్‌గా మంచి పేరే ఉందని.. కానీ కరోనా మూడో వేవ్ వచ్చాక తాను మోడీ దగ్గర స్పాట్ బాయ్‌గా చేరాలనుకుంటున్నానని వర్మ మరో సెటైరికల్ ట్వీట్ వేశాడు.

సోనియా గాంధీ 2014లో మోడీని మృత్యు వ్యాపారిగా అభివర్ణించిందని, తన విజన్ను‌ అప్పుడు సరిగా అర్థం చేసుకోనందుకు ఆమెకు ఇప్పుడు క్షమాపణ చెబుతున్నానని వర్మ మరో ట్వీట్ వేశాడు. మరోవైపు మోడీ-షా ద్వయాన్ని బోల్తా కొట్టిస్తూ మమతా బెనర్జీ సాధించిన విజయాన్ని సూచిస్తూ వర్మ ఓ ఫన్నీ వీడియోను షేర్ చేశాడు. అది వైరల్ అవుతోంది. నిన్నటి వరకు దీదీ కథ ముగిసిందని మోడీ అంటుండేవాడని.. మరి ఈ రోజు నుంచి ఏమంటాడని ఎద్దేవా చేస్తూ వర్మ మరో ట్వీట్ వేశాడు. ఇవన్నీ కూడా బాగానే పేలుతున్నాయి.