‘పుష్ప’ కి మణిరత్నం సినిమాకు లింక్ పెట్టేసారే

ఓ పెద్ద హీరో సినిమా మొదలైందంటే మీడియాలో వరసపెట్టి కథనాలు వస్తూంటాయి. ఆ సినిమా కథేంటి..అందులో స్పెషాలిటీ ఏమిటి..హీరో క్యారక్టర్ ఏమిటి..ఇలాఎన్నో. ఇక సినిమా ట్రైలర్ కానీ టీజర్ కానీ వచ్చిందా…దాని చుట్టూ అనేక కథలు, కథనాలు అల్లేస్తారు మనవాళ్లు. ఆ సినిమాలో కథ ఇదేనని, ఫలానా సినిమా నుంచి పాయింట్ ఎత్తినట్లు ఉందని రకరకాల టాపిక్స్ మీద స్టోరీలు వచ్చేస్తాయి. ఓ రకంగా అవన్ని ప్రాజెక్టుకు క్రేజ్ పెంచేవే. జనాల నోట్లో ఏదో విధంగా రూపాయి ఖర్చులేకుండా సినిమా నానటానికి ఉపయోగపడేవే. కాబట్టి లైట్ తీసుకుంటారు. ఇప్పుడు పుష్ప సినిమాపై అలాంటి కథనం ఒకటి ప్రచారంలోకి వచ్చింది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా కథ..మణిరత్నం సినిమాకి కాపీ అంటూ మీడియా సర్కిల్స్ లో ఓ వార్త హల్చల్ చేస్తోంది. ఆ సినిమా మరేదో కాదు విక్రమ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కాంబోలో చేసిన విలన్. రామాయణాన్ని ..రావణుడు వైపు నుంచి చెప్పబడ్డ కథ అది. సీతలాంటి ఐశ్వర్యారాయ్ ని రావణుడు లాంటి విక్రమ్ ఎత్తుకొచ్చేసి ఓ అడవిలో పెట్టేస్తాడు..అందుకు కారణం తన చెల్లి మరణం అని రివీల్ అవుతుంది. ఇప్పుడు పుష్పలో కూడా అలాంటి పాయింటే ఉంటుందంటున్నారు.

అప్పట్లో ఆడని ఆ సినిమా కథని మార్చి..ఎర్ర చందనం బ్యాక్ డ్రాప్ పెట్టి…సుకుమార్ సరికొత్త ట్రీట్మెంట్ తో స్క్రిప్టు రాసాడని అంటున్నారు. చెల్లెలి చావుకి కారణమైన పోలీసాఫీసర్ కి గుణపాఠం చెప్పాలన్నది మణిరత్నం తీసిన విలన్ మూవీకి నేపథ్యం. అందులో విక్రమ్ హీరో అయితే చెల్లి పాత్రలో ప్రియమణి నటించారు. అదే సిస్టర్ సెంటిమెంట్ ని, అదే ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తో సుకుమార్ ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేశారంటున్నారు.

దీనికి తోడు హీరో పుష్పరాజ్ చెల్లిగా ఐశ్వర్య రాజేష్ ఓకే అయినట్లు కూడా ఓ టాక్ నడుస్తోంది. పుష్పరాజ్ ని ఢీకొట్టే నెగిటివ్ పోలీసాఫీసర్ పాత్రలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కనిపించబోతున్నారు. ఇవన్ని పజిల్ లాగ ఒకదానికొకటి కలిపి ఇలా తనకు తోచిన కథ అల్లేసికుంటున్నారు. పుష్ప గురించి వినిపిస్తున్న ఈ కొత్త కథలో నిజమెంతనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.