కడప ఆసుపత్రులే ప్రభుత్వాన్ని లెక్క చేయటంలేదా ?

క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కడప పట్టణంలోని ఎనిమిది ఆసుపత్రుల యాజమాన్యాలు కోవిడ్ రోగులకు చికిత్సను అందించమంటు బయట పెద్ద బోర్టులు, బ్యానర్లు పెట్టేయటం కలకలం సృష్టిస్తోంది. దీనికి ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్న కారణాలు ఏమిటయ్యా అంటే కరోనా వైరస్ నేపధ్యంలో చికిత్స అందిస్తున్న తమ వైద్యులను ప్రభుత్వం వేధిస్తున్నదట. ఇందుకు నిరసనగా అసలు కోవిడ్ రోగులను చేర్చుకోవటమే మానేశారు.

అసలు విషయం ఏమిటంటే కోవిడ్ రోగులకు చికిత్సను అందించటంలో భాగంగా కొన్ని ఆసుపత్రులు నిర్దేశించిన ఫీజులకన్నా బాగా ఎక్కువగా వసూళ్ళు చేస్తున్నాయట. ఆరోపణలపై ప్రభుత్వ యంత్రాంగం దృష్టిపెట్టింది. అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాత రెండు ఆసుపత్రులపై విజిలెన్స్ అధికారులు దాడులుచేశారు. అధిక ఫీజులను వసూలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేల్చారు. దాంతో మిగిలిన ఆసుపత్రులకు కూడా బాగా మండింది.

ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల స్ధానంలో తమిష్టం వచ్చినంత ఫీజులు వసూలు చేసుకుంటామన్న ధోరణిలో ఆసుపత్రుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో ఎనిమిది ఆసుపత్రులు కోవిడ్ రోగలను చేర్చుకోవటం మనేశాయి. ఒక్కసారిగా ఎనిమిది ఆసుపత్రుల్లో కోవిడ్ రోగులను చేర్చుకోవటం ఆపేయటంతో ఇబ్బందులు మొదలైపోయాయి.

ఇదే విషయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ ఎనిమిది ఆసుపత్రుల నిర్ణయంతో తమకు సంబంధం లేదన్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు శుక్రవారం కలెక్టర్ తో భేటీ అవుతున్నట్లు చెప్పారు. సమస్య పరిష్కారం అవుతుందనే అనుకుంటున్నట్లు రెడ్డి తెలిపారు. మరి కలెక్టర్- ఆసుపత్రుల యాజమాన్యం భేటిలో ఏమవుతుందో చూడాలి.