టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే కాగిత మృతి

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. క‌రోనా దెబ్బ‌తో.. ఇప్ప‌టికే రాష్ట్ర వ్యాప్తంగా ప‌లువురు నాయ‌కులు, పార్టీ శ్రేణులు.. ప్రాణాలు కోల్పోతున్న విష‌యం తెలిసిందే. విశాఖ‌, చిత్తూరు, అనంత‌పురం జిల్లాల్లో వ‌రుస‌గా జ‌రుగుతున్న ఈ ఘ‌ట‌న‌ల‌పై పార్టీలో తీవ్ర ఆవేద‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆయాన ఘ‌ట‌న‌ల‌పై పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేస్తున్నారు.

అయితే.. ఇప్పుడు మ‌రో కీల‌క నేత‌, పార్టీలో చాలా సీనియ‌ర్‌, మాజీ ఎమ్మెల్యే కాగిత వెంక‌ట్రావు తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయ‌న.. కొద్దిసేప‌టి కింద‌ట మృతి చెందారు. ఈ విషాదంతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గుర‌య్యారు. కృష్నాజిల్లా పెడ‌న నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన కాగిత వెంక‌ట్రావు.. టీడీపీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. త‌న‌కంటూ.. ప్ర‌త్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.

పెడ‌న నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2009 ఎన్నిక‌ల్లో పోటీ చేసిన కాగిత‌.. కేవ‌లం వెయ్యి ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్ప‌ట్లో త్రిముఖ పోరు నెల‌కొన్న‌ప్ప‌టికీ.. కాగిత గౌర‌వ‌ప్ర‌ద‌మైన ఓట్లు సంపాయించుకున్నారు. అంతేకాదు.. పార్టీని కూడా బ‌లోపేతం చేసేందుకు కృషి చేశారు. ఈ క్ర‌మంలోనే 2014లో ఆయ‌న ఇక్క‌డ నుంచి పోటీ చేసి.. విజ‌యం సాధించారు. ఏకంగా 13 వేల ఓట్ల మెజారిటీ ద‌క్కించుకుని గెలుపు గుర్రం ఎక్కారు. జిల్లాలో మంచి పేరున్న కాగిత‌కు మంత్రి ప‌ద‌వి కూడా ద‌క్కుతుంద‌ని అప్ప‌ట్లో చ‌ర్చ సాగింది.

అయితే.. అనారోగ్యం కార‌ణంగా 2018 నుంచి ఆయ‌న పార్టీలో పెద్దగా దూకుడు ప్ర‌ద‌ర్శించ‌లేక పోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న కుమారుడు కాగిత కృష్ణ‌ప్ర‌సాద్ తండ్రివార‌స‌త్వాన్ని అందిపుచ్చుకుని రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశారు. గ‌త 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై కృష్ణ‌ప్ర‌సాద్ పోటీ చేశారు. అయితే.. వైసీపీ సునామీ కార‌ణంగా ఓడిపోయారు. అప్ప‌టి నుంచి పార్టీకోసం కృషి చేస్తున్నారు. కాగా, కాగిత వెంక‌ట్రావు మృతితో కృష్ణాజిల్లాలో టీడీపీ కీల‌క‌మైన నాయ‌కుడిని కోల్పోయింద‌ని.. సీనియ‌ర్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.