ఇదేం ఐపీఎల్‌ బాబోయ్

పోయినేడాది కరోనా వైరస్ ధాటికి వేసవి నుంచి అక్టోబరు-నవంబరు నెలలకు వాయిదా పడింది ఐపీఎల్. అంతే కాదు.. ఇండియాలో కాకుండా యూఏఈలో టోర్నీ నిర్వహించారు. ఎన్నో సందేహాల మధ్య అక్కడ మొదలైన ఐపీఎల్.. ఆరంభ దశలోనే తిరుగులేని మజాను అందించి క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేసింది. లీగ్ చరిత్రలోనూ ఎన్నడూ లేనంతగా అత్యంత ఆసక్తికరంగా సాగాయి మ్యాచ్‌లు. కరోనా ధాటికి అల్లాడిపోయి ఉన్న భారతీయులకు ఆ లీగ్ గొప్ప ఉపశమనాన్ని అందించింది. లీగ్ చరిత్రలోనే అదే బెస్ట్ సీజన్ అన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

ఐతే ఈ ఏడాది వేసవిలో షెడ్యూల్ ప్రకారమే.. అది కూడా ఇండియాలోనే ఐపీఎల్ జరుగుతోంది. కానీ టోర్నీ అనుకున్నంత కిక్ ఇవ్వడం లేదు. నిరుడు ఐపీఎల్ జరిగే సమయానికి కరోనా తగ్గుముఖం పట్టి జనాల మూడ్ పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. కానీ ఇప్పుడు కరోనాతో జనం అల్లాడిపోతున్న సమయంలో ఐపీఎల్ నడుస్తుండగా.. టోర్నీ అంచనాలకు తగ్గట్లు సాగకపోవడం చిరాకు తెప్పిస్తోంది.

బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ సహా కొందరు కీలక ఆటగాళ్లు దూరమై కొన్ని జట్లు బలహీనపడిపోగా.. టోర్నీలో కొన్ని టీమ్స్ మరీ పేలవంగా ఆడుతుండటం.. పిచ్‌లు మరీ నెమ్మదిగా ఉండి స్వల్ప స్కోర్లు నమోదవుతుండటం.. మ్యాచుల్లో అనుకున్నంత ఉత్కంఠ లేకపోవడం అభిమానులకు నిరాశ కలిగిస్తోంది. చెన్నైలో జరిగిన తొలి దశ మ్యాచ్‌లు అయితే టోర్నీ మీదే ఆసక్తి తగ్గించేశాయి. అక్కడ పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం సాగింది. బ్యాటింగ్ మెరుపులు పెద్దగా లేవు. సర్లే చెన్నైలో మ్యాచ్‌లు అయిపోయాయి కదా అనుకుంటే.. కొత్త వేదిక అహ్మదాబాద్ మరింత అన్యాయంగా తయారైంది.

ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో విధ్వంసక బ్యాట్స్‌మెన్‌తో నిండిన పంజాబ్ 120+ స్కోరు మాత్రమే చేసింది. దాన్ని ఛేజ్ చేయడానికి కోల్‌కతా చాలా కష్టపడిపోయింది. మ్యాచ్‌లు ఇలా సాగితే మజా ఏముంటుంది? ఐపీఎల్ అంటేనే అభిమానులు ఫోర్లు, సిక్సర్ల మోత ఆశిస్తారు. మొన్నటి జడేజా మెరుపు ఇన్నింగ్స్ లాంటివి ఈసారి బాగా తగ్గిపోయాయి. ఉత్కంఠభరిత మ్యాచ్‌లూ తగ్గాయి. కరోనా భయం వల్ల మనసు పెట్టి ఆడలేకపోతున్నారో ఏమో కానీ.. స్టార్ ఆటగాళ్ల నుంచి ఆశించిన మెరుపులు కూడా కరవై ఇదేం ఐపీఎల్‌రా బాబూ అని అభిమానులు ఫీలయ్యే పరిస్థితి కనిపిస్తోంది.